Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీపై ప్రశంసలు కురిపించిన గులాం నబీఆజాద్.. అక్కడ బీజేపీని ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్కే ఉందని వ్యాఖ్య.
కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని విడిచిపెట్టిన నెలల తర్వాత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీపై ప్రశంసల జల్లు కురిపించాడు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని తెలిపాడు.
Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని విడిచిపెట్టిన నెలల తర్వాత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీపై ప్రశంసల జల్లు కురిపించాడు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని తెలిపాడు. ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ నుండి విడిపోయినప్పటికీ, వారి లౌకికవాద విధానానికి నేను వ్యతిరేకం కాదు. పార్టీ వ్యవస్థ బలహీనపడటం వల్లనే నేను పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపాడు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని, ఆప్ ఆ పనిచేయలేదని ఆజాద్ అన్నాడు.
కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లిం, రైతులందరినీ, అన్నివర్గాల ప్రజలను ఆదరిస్తుందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ అంటూ విమర్శలు చేశారు. పంజాబ్లో ఆ పార్టీని గెలిపించినప్పటికీ ప్రజల ఆశల మేరకు సమర్థపాలన అందించడం లేదని ఆరోపించారు. త్వరలో జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాత్రమే బీజేపీని సవాల్ చేయగలదన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోయే విధానాన్ని కలిగి ఉందని తెలిపారు.
ఇదిలాఉంటే.. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించడంపై, తాను ఈ సమస్యను చాలాసార్లు లేవనెత్తానని, కేంద్ర ప్రభుత్వం చేస్తే అది స్వాగతించదగిన చర్య అని గులాం నబీ ఆజాద్ అన్నాడు.