Fourth National Serosurvey : 67 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు
దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందిలో కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Fourth National Serosurvey దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందిలో కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇంకా దాదాపు 40 కోట్ల మందికి వైరస్ ముప్పు పొంచి ఉందని తెలిపింది.
ఇవాళ నాలుగో జాతీయ సెరో సర్వేను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ఈ నాలుగో సెరో సర్వేలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)..పిల్లలను కూడా చేర్చింది. కరోనావైరస్ ముప్పు వారిపై ఏ విధంగా అంచనా అంచనా వేయడానికి పిల్లలను ఇందులో చేర్చారు. ఈ ఏడాది జూన్-జులై మధ్యలో నిర్వహించిన సెరో సర్వేలో చిన్న పిల్లలతో పాటు ప్రతి జిల్లాలోని 100 మంది హెల్త్ కేర్ వర్కర్లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. కాగా, మొత్తంగా సర్వేలో పాల్గొన్న 67.6శాతం మంది భారతీయుల్లో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించినట్లు సెరో సర్వే పేర్కొంది.
దేశంలో 6-17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో 50 శాతానికిపైగా ఈ కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. 18-44 ఏళ్ల వయసు వాళ్లలో 66.7 శాతం మందిలో, అత్యధికంగా 45- 60 ఏళ్ల వయస్సు వారిలో 77.6 శాతం మందికి, 60 ఏళ్లు పైబడిన వాళ్లలో 76.7 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు సెరో సర్వే తేల్చింది.
ఈ సర్వేలో పిల్లలను రెండు గ్రూపులు విభజించారు. 6-9 ఏళ్లు, 10-17 ఏళ్లు. వీళ్లలో 6-9 ఏళ్ల వయస్సు వాళ్లలో 57.2 శాతం మందిలో, 10-17 వయసు వాళ్లలో 61.6 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు.