Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర వెనుక చరిత్ర ఏంటి.. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం విశేషాలు తెలుసుకోండి
అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత.. అంతకు మించి విశిష్టత ఉందని చెబుతుంటారు. సుమారు ఐదు వేళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాల కథనం..

Amarnath Yatra 2023 Significance
Amarnath Yatra 2023 : ప్రతి హిందువూ పరమపవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర వెనుక చరిత్ర (History) ఏంటి? అంత ఎత్తులో, ఆ గుహలో ముక్కంటిని దర్శించుకునేందుకు ఎంత కష్టాన్ని అయిన భరించేంత భక్తుల నమ్మకం వెనుక రహస్యమేంటి?.. ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది. ఆలయ ట్రస్టు బోర్డు ఎలాంటి సౌకర్యాలు సమకూర్చుతోంది. భద్రతపై భరోసా ఉందా? ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడే అమర్నాథ్ వైభోగం ఏంటి?
అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత.. అంతకు మించి విశిష్టత ఉందని చెబుతుంటారు. సుమారు ఐదు వేళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాల కథనం.. కశ్మీర్ లోయ నీటిలో మునిగిపోగా, కశ్యప్ మహాముని హరించాడని ఓ కథనం. ఈ పురాణగాథ ప్రకారం అమర్నాథ్ దర్శనం పొందిన మొదటి వ్యక్తి భృగు ముని అని చెబుతుంటారు. ఇక అమర్నాథ్ గుహ శివుని నివాసంగా ఎక్కువ మంది భావిస్తారు. ప్రజాదరణ పొందిన నమ్మకాల ప్రకారం స్థానికంగా ఉంటే గడారియా అనే కమ్యూనిటీ అమర్నాథ్ గుహను కనుగొందని.. బాబా బర్ఫానీ మొదటిసారిగా దర్శనం చేసుకున్నారని మరో కథనం ప్రచారంలో ఉంది.
ఈ లోకం నుంచి పార్వతీపరమేశ్వరులు అంతర్థానం అయ్యింది కూడా ఇక్కడే అని చెబుతారు. శ్రీనగర్కు వంద కిలోమీటర్ల దూరంలో పెహల్గామ్ అనే గ్రామం ఉంది. దీనిని ‘బైల్ గామ్’ అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇక చందన్వారీలో తన సిగలోని చంద్రుడినీ, శేష్నాగ్ దగ్గర తన మెడలో పాములనీ, మహాగణేశ పర్వతం వద్ద కుమారుడు గణేశుడినీ, పంచతరణి దగ్గర తనలోని పంచభూతాలనీ విడిచారని చెబుతారు. ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచినవాటిని తలపించేలా ఉండటం విశేషం.
ఇన్ని విశేషాలు ఉన్న ప్రదేశం కనుకే.. ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పూజలు అందుకుంటోంది. అయితే అమర్నాథ్ యాత్ర సజావుగా సాగిపోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సివుంటుంది. ప్రకృతి విలయంతో పాటు.. బుసలు కొట్టే ఉగ్రవాద మూకలు అమర్నాథ్ యాత్రకు ప్రతికూలంగా మారుతుంటాయి. గత ఏడాది కూడా కొండచరియలు విరిగిపడటం.. ఆకస్మిక వరదలతో యాత్ర అసంపూర్తిగానే ముగిసింది. ఈ ఏడాది ప్రకృతి కరుణిస్తే 62 రోజుల యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. ఉగ్రవాదుల నుంచి ముప్పు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశాయి.
ముఖ్యంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా భక్తులు అమర్నాథ్ను దర్శించుకునే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ కోసం ఎయిర్పోర్టులు, విమానాశ్రయాలు, బస్టాండ్ల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అమర్నాథ్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగులు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలు, ఐడీ ప్రూఫ్ చూపిస్తే.. వారి చేతికి ఈ ట్యాగులు తగిలిస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ లేకుండా ఏ ఒక్కరు కూడా.. అమర్నాథ్ యాత్ర మార్గంలోకి ప్రవేశించే అవకాశమే లేదు. కొండపై కిలోమీటర్ల ఎత్తులో భక్తులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ఎవరికైనా ఏమైనా జరిగితే.. వారి వివరాలను గుర్తించేందుకు ఈ ట్యాగ్లు పనికొస్తాయని ఆలయ అధికారులు చెబుతున్నారు.
Also Read: అజిత్ పవార్ సీఎం కాబోతున్నారా? షిండేను పక్కన పెట్టే గేమా ఇది?
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సౌకర్యాలను మరింత అప్గ్రేడ్ చేశారు. భక్తుల సౌకర్యం కోసం.. బాల్తాల్, డోమెల్ ప్రాంతాల మధ్య బ్యాటరీ వాహనాలను తిప్పుతున్నారు. ఒకేరోజులో దర్శనం పూర్తిచేసుకోవాలి అనుకునే భక్తుల కోసం శ్రీనగర్ నుంచి పంచతరణి వరకు చాపర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయ్. రక్తం గడ్డకట్టించే చలిలో, కాలు జారితే మరణం చేరువయ్యే దారిలో… ఎంతో శ్రమపడి అమర్నాథ్ గుహకు చేరుకునే భక్తులు దాదాపు 130 అడుగులు ఉండే గుహలో శివలింగాన్ని దర్శించాక అద్భుతమైన అనుభూతిని పొందుతారు.
Also Read: జులై మాసంలో తిరుమలలో విశేష ఉత్సవాలు
వేసవి ముగిశాకే ఈ మహాద్భుత శివ లింగం దర్శన భాగ్యం కలుగుతుంది. అదీ సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి రెండు నెలల మధ్యే ఉంటుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటిబొట్లు లింగాకారంలోకి మారతాయ్. వేల ఏళ్ల నుంచి ఇలానే జరుగుతోంది. ఈ మనోహర దృశ్యాన్నివీక్షించేందుకే భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఎన్నో కష్టాలను ఓర్చి హరహరుడిని దర్శించుకుంటారు. అమర లింగేశ్వరుడిని దర్శించి జన్మ సార్థకం చేసుకోవాలని.. ఆ క్షణాన్ని జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకోవాలని భక్తులు భావిస్తుంటారు.
హరహరుని నామస్మరణతో మార్మోగుతున్న హిమగిరులు.. వివరాలకు ఈ వీడియో చూడండి..