పరీక్షా కేంద్రంలో తల్లులు.. పసిబిడ్డలను లాలించిన పోలీసులు

పరీక్షా కేంద్రంలో తల్లులు.. పసిబిడ్డలను లాలించిన పోలీసులు

పోలీసుల్లోని మానవత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఈ ఫొటో. తల్లులు పరీక్ష రాయడానికి వెళ్తే పసిబిడ్డలను సంరక్షిస్తూ నిల్చొన్నారు పోలీసులు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. టీచర్ ఎలిజెబిలిటీ టెస్టు(టెట్) అర్హత పరీక్ష రాసేందుకు ఇద్దరు తల్లులు పిల్లలను తీసుకుని వచ్చారు. వారు పరీక్ష రాసేంత సేపు ఆ పిల్లల సంరక్షణను ఇద్దరు మహిళా పోలీసులే చూసుకున్నారు. 

అస్సాం పోలీసులు దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. దాంతో పాటు ‘తల్లి అనే పదం అందరికీ ఒకటే. అమ్మతనానికి ఎవరనేది సంబంధం లేదు. డారాంగ్ జిల్లాలో టెట్ పరీక్ష రాయడానికి వచ్చిన పసిపిల్లల తల్లులకు సహాయంగా అస్సాం పోలీసులు వారిని సంరక్షిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. 

ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఆ ఇద్దరి పోలీసులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. క్రిమినల్స్ ను పట్టుకోవడమే కాకుండా, సమాజం గురించి ఇటువంటి పనులు కూడా చేసి హృదయాలను గెలుచుకుంటున్నారని, మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారంటూ కామెంట్ చేస్తున్నారు.