Maharashtra Complete Lockdown : మహారాష్ట్రలో సంపూర్ణ లాక్డౌన్.. ఈ సాయంత్రమే క్లారిటీ..
భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా ధాటికి మహారాష్ట్ర అల్లకల్లోలమైపోతోంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూలు, వారాంతంలో లాక్ డౌన్లు, 144 సెక్షన్ విధించినా కరోనా నియంత్రణలోకి రావడం లేదు. పూర్తి లాక్ డౌన్ ఒక్కటే సరైన మార్గంగా కనిపిస్తోంది.
Coronavirus India Live Updates : భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా ధాటికి మహారాష్ట్ర అల్లకల్లోలమైపోతోంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూలు, వారాంతంలో లాక్ డౌన్లు, 144 సెక్షన్ విధించినా కరోనా నియంత్రణలోకి రావడం లేదు. పూర్తి లాక్ డౌన్ ఒక్కటే సరైన మార్గంగా కనిపిస్తోంది. సంపూర్ణ లాక్ డౌన్ విధించేందుకు మహా సర్కార్ కసరత్తు ప్రారంభించింది. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మహారాష్ట్ర కేబినెట్ పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే బుధవారం (ఏప్రిల్ 21,2021) సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. కరోనా కట్టడి కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలపై ఈ రోజు రాత్రి 8 గంటలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించే అవకాశం ఉంది.
కరోనా కేసులతో మహారాష్ట్రలో ఆరోగ్య సంక్షోభం నెలకొంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత, వైద్య సదుపాయాల కొరత వెంటాడుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా నుంచి ప్రజలను రక్షించాలంటే సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయాన్ని మహా ప్రభుత్వం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దేశంలో రోజువారీ కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో బుధవారం ఉదయం 9 గంటల వరకు 2.95 లక్షలు నమోదు కాగా.. 2,023 మరణాలు నమోదయ్యాయి. దాంతో భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 1,56,16,130 చేరగా, మరణాల సంఖ్య 1,82,553కు చేరింది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 21,57,538కు చేరాయి.
సీరమ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డోసుకు రూ.400, ప్రైవేటు ఆస్పత్రులకు ఒక డోసుకు రూ.600కు విక్రయించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సీరమ్ ఒక డోసుకు రూ.150 చొప్పున విక్రయిస్తోంది. కేంద్ర వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 50శాతం సామర్థ్యంతో వ్యాక్సిన్లు కేటాయించినట్టు పుణె కంపెనీ సీరమ్ పేర్కొంది. రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల కోసం మిగతా 50శాతం అందించనున్నట్టు తెలిపింది. మే 1 నుంచి 18ఏళ్లు దాటిన అందరికి కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజున సీరమ్ ఈ ప్రకటనను వెల్లడించింది.