India GDP : నాలుగేళ్ల కనిష్ఠానికి జీడీపీ..2020-21లో 7.3శాతం తగ్గుదల
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం గట్టిగానే పడింది.
India GDP దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం గట్టిగానే పడింది. 2019-20 ఆర్థిక ఏడాది (4శాతం వృద్ధి)తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.3 శాతం క్షీణత నమోదు చేసింది. ఈ మేరకు సోమవారం కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో)సంబంధిత గణాంకాలను విడుదల చేసింది.
కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం…2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా స్థూల దేశీయోత్పత్తి (GDP) 7.3 శాతం పతనమవగా..నాలుగు దశాబ్దాల చరిత్రలో ఇదే కనిష్ఠం కావడం గమనార్హం. అయితే ఆర్థిక సంవత్సరం చివరన జనవరి-మార్చి (నాలుగో త్రైమాసికం)లో ఆర్థిక కార్యకలాపాలు కొంతమేర గాడినపడటంతో జీడీపీ 1.6 శాతం పెరిగినట్లు కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. మూడో త్రైమాసికంతో పోలిస్తే 0.5 శాతం పెరుగుదల నమోదు చేసినట్లు తెలిపింది. మరోవైపు, 2019-20 ఆర్థిక ఏడాది జనవరి-మార్చి సమయంలో 3 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఎన్ఎస్ఓ తెలిపింది. అయితే, మార్చి నెల గణాంకాలు ఎకానమీ అన్ లాకింగ్కు ప్రతిరూపంగా నిలిచాయని పలువురు ఎకనామిస్టులు అభిప్రాయపడ్డారు.
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో వెలువరించిన తొలి విడత అంచనాల్లో 7.7 శాతం క్షీణతను అంచనా వేయగా.. తర్వాత దాన్ని 8 శాతం ఉంటుందని ఎన్ఎస్వో సవరించిన విషయం తెలిసిందే.