రెచ్చగొడితే తాట తీస్తాం…చైనాకు మోడీ సీరియస్ వార్నింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : June 17, 2020 / 01:26 PM IST
రెచ్చగొడితే తాట తీస్తాం…చైనాకు మోడీ సీరియస్ వార్నింగ్

సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖ వెంబడి తలెత్తిన ఘర్షణలో అమరులైన సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.  తూర్పు లడఖ్ లోని గాల్వన్​ లోయ దగ్గర  జరిగిన ఘర్షణలో అమరులైన జవాన్ల ప్రాణ త్యాగాన్ని వృథా కానివ్వమని ప్రధాని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాన్ని వృథా కానివ్వమని చెప్పిన మోడీ.. భారత్ తగిన సమాధానం ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉందని  చైనాను హెచ్చరించారు. 

కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్​గా సమావేశమైన సమయంలో  భారత్​- చైనా సరిహద్దు వివాదంపై మోడీ  ఈ  కీలక వ్యాఖ్యలు చేశారు.. సైనికుల త్యాగాలను స్మరిస్తూ ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని  2 నిమిషాలు మౌనం పాటించారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని … రెచ్చగొడితే మాత్రం దీటైన జవాబిస్తామని ఈ సందర్భంగా మోడీ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. 

మన జవాన్ల ప్రాణత్యాగం వృథా కానివ్వమని దేశానికి నేను భరోసా ఇస్తున్నాను. భారత్ ఐక్యత, సార్వభౌమత్వం మాకు ముఖ్యం. వీటిని రక్షించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి భ్రమలు, సందేహాలు అక్కరలేదు. భారత్​ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది. కానీ రెచ్చగొడితే మాత్రం దీటైన బదులివ్వడానికి తగిన సామర్థ్యం భారత్​కు ఉంది అని మోడీ అన్నారు. 

భారతదేశం ఎల్లప్పుడూ ఇరుగుపొరుగు దేశాలకు సహకరిస్తూ, స్నేహపూర్వకంగా కలిసి పనిచేసిందని గుర్తు చేశారు. పొరుగు దేశాల అభివృద్ధిని, క్షేమాన్ని కాంక్షించిందని స్పష్టం చేశారు. విభేదాలు వచ్చినప్పుడెల్లా, అవి వివాదాలుగా మారకుండా ఉండేందుకు భారత్​ కృషి చేసిందని మోడీ తెలిపారు. 

సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అమరులైన జవాన్లలో ఒకరు తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు  కూడా వున్న విషయం తెలిసిందే.  దాదాపు 40మంది చైనా సైనికులు కూడా ఈ ఘర్షణలో చనిపోయారని సమాచారం.