Tirumala Alert : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ విజ్ఞప్తి చేశారు.

Tirumala Alert : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

Tirumala Alert : తిరుమల భక్తులకు అలర్ట్. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. జనవరి 2 నుంచి 11 వరకు తిరుమల వెళ్లే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులకు వైకుంఠ దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. రోజుకు 50వేల చొప్పున 10 రోజుల పాటు 50లక్షల టోకెన్లు జారీ చేస్తామన్నారు. మొత్తం 9 చోట్ల టోకెన్లను జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 ఎస్‌ఇడి టికెట్లు 2లక్షలు కేటాయించినట్టు తెలిపారు.

తిరుపతిలో అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా గల విష్ణు నివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక గల 2, 3 సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్పీ హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి 1న సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని తెలిపారు. భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తమ తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు.

తిరుమలలో వసతి సౌకర్యం తక్కువగా ఉన్నందున దర్శన టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే ముందు వచ్చిన వారికే ముందు అన్న ప్రాతిపదికపై వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు.