IND VS PAK : రిజర్వ్ డేకు భారత్, పాక్ మ్యాచ్.. వరుణుడు కరుణించేనా..?
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లింది. వరుణుడు పదే పదే అంతరాయం కలిగించడం, మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్ను సోమవారం (సెప్టెంబర్ 11)కి వాయిదా వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
![IND VS PAK : రిజర్వ్ డేకు భారత్, పాక్ మ్యాచ్.. వరుణుడు కరుణించేనా..? IND VS PAK : రిజర్వ్ డేకు భారత్, పాక్ మ్యాచ్.. వరుణుడు కరుణించేనా..?](https://10tv.in/wp-content/uploads/2023/09/New-Project-9-4.jpg)
IND VS PAK
India vs Pakistan : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లింది. వరుణుడు పదే పదే అంతరాయం కలిగించడం, మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్ను సోమవారం (సెప్టెంబర్ 11)కి వాయిదా వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ రోజు ఆటకు ఎక్కడైతే బ్రేక్ పడిందో రేపు తిరిగి అక్కడి నుంచే మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ రోజు మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టాపోయి 147 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (17), విరాట్ కోహ్లి (8) లు క్రీజులో ఉన్నారు.
అంతకముందు టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (56; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్ మన్ గిల్ (58; 52 బంతుల్లో 10 ఫోర్లు) లు పాక్ బౌలర్లపై ఎదురుదాటికి దిగారు. ఆరంభ ఓవర్లలో జాగ్రత్తగా ఆడిన ఈ జోడి క్రమంగా వేగం పెంచింది. గత మ్యాచులో టీమ్ఇండియాను దెబ్బకొట్టిన షాహీన్ అఫ్రీది బౌలింగ్లో వరుస ఓవర్లలో గిల్ మూడేసి చొప్పున ఫోర్లు కొట్టాడు. దీంతో స్కోరు వేగం పెరిగింది.
IND vs PAK : రీ ఎంట్రీ మ్యాచ్లోనే విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన కేఎల్ రాహుల్
అటు రోహిత్ శర్మ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో గిల్ 37 బంతుల్లో, రోహిత్ శర్మ 42 బంతుల్లో అర్థశతకాలను పూర్తి చేసుకున్నారు. ప్రమాకరంగా మారిన ఈ జోడీని రోహిత్ను ఔట్ చేయడం ద్వారా షాదాబ్ ఖాన్ విడగొట్టాడు. దీంతో 121 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్లో షాహీన్ అఫ్రీది బౌలింగ్లో గిల్ కూడా పెవిలియన్కు చేరుకున్నాడు. దీంతో స్వల్ప విరామంలో రెండు వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేగం మందగించింది.
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్లు కుదురుకుని జోరు పెంచే సమయంలో వర్షం మొదలైంది. భారీ వర్షం కురిసింది. వరుణుడు తెరిపి నిచ్చిన గంట సేపటి తరువాత మ్యాచ్ను నిర్వహించేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు. అంపైర్లు మైదానాన్ని పరిశీలిస్తుండగా మరోసారి వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ను మరుసటి రోజుకు వాయిదా వేశారు. అయితే.. రేపు కూడా కొలొంబోలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని ఆదేశ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా..? రద్దు అవుతుందా..? అన్న టెన్షన్ అభిమానుల్లో మొదలైంది.