Revanth Reddy : ధరణి పేరుతో భారీ దోపిడీ, తెలంగాణ భూములన్నీ ఆంధ్రా శ్రీధర్ రాజుకు కట్టబెట్టారు- రేవంత్ రెడ్డి
Revanth Reddy : ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని కాగ్ చెప్పింది. ధరణిలో ఆధార్, పాన్ వివరాల సమాచారం దేశాలు దాటి వెళుతోంది.

Revanth Reddy (Twitter, Google)
Revanth Reddy – Dharani Portal : ధరణి దోపిడీపై శోధిస్తున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఇలాంటి దోపిడీకి పాల్పడలేదన్నారు. ప్రభుత్వ పనిని ధరణి పేరుతో పూర్తిగా ప్రైవేట్ కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు(IL&FS) కట్టబెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో భూ లావాదేవీలన్ని ధరణి పోర్టల్ నిర్వహిస్తోందన్నారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ గతంలో రూ.90 వేల కోట్లు బ్యాంకులను నిండా ముంచిందన్నారు. దివాళా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ధ్వజమెత్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి తప్పు అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
”’ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు సబ్సిడరీ కంపెనీ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 52శాతం వాటాను టెర్రాసిస్ కంపెనీ ఫిలిప్పీన్ కంపెనీ రూ.12,745 కోట్లకు అమ్ముకుంది. రూ.150 కోట్లతో వ్యాపారం చేసే టెర్రాసిస్ కంపెనీ ఫాల్కాన్ కంపెనీకి నవంబర్ 25, 2021 న రూ.1,275 కోట్లకు అమ్ముకుంది. కొనుగోలు చేసేకంటే ఒక నెల ముందు మాత్రమే ఫాల్కన్ కంపెనీ ప్రారంభించారు.
ఇప్పుడు టెర్రాసిస్ కంపెనీ 99 శాతం వాటా ఫాల్కన్ కంపెనీకి ఇచ్చేసింది. ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్ళిపోయింది. శ్రీధర్ రాజుకు, కేటీఆర్ కు ఉన్న సంబంధం ఏమిటని నేను ప్రశ్నించడం లేదు. ఒడిశా ప్రభుత్వం 2010లో ఈ-ధరణి పేరుతో ఈ ప్రాజెక్టు లాంచ్ చేసింది. ఈ కంపెనీ నిర్వాకంపై 2017లో కాగ్ నివేదిక ఇచ్చింది. ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని కాగ్ చెప్పింది. కేసీఆర్ తానే అద్భుతాలు చేసి ధరణిని సృష్టించినట్టు చెప్పారు. తన దోపిడీని కప్పి పుచ్చుకోవడానికి కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. ధరణిలో ఇప్పటివరకు 25లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో రూ.50 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని అంచనా.
ఇవన్నీ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లడం లేదు. ఇవన్నీ శ్రీధర్ రాజు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయి. ఇక్కడే అసలు మతలబు ఉంది. రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తిరిగి డబ్బులు రావడం లేదు. ఆన్ లైన్ లో మాత్రం డబ్బులు రీఫండ్ కావడం లేదు. ఇలా ఎన్ని వందల కోట్లు కంపెనీ ఖాతాలోకి వెళ్తున్నాయి? అసలు ఆ డబ్బులు ప్రభుత్వానికి చేరుతున్నాయా?
ధరణిలో ఆధార్, పాన్ వివరాల సమాచారం దేశాలు దాటి వెళుతోంది. డేటా ప్రైవసీ ప్రకారం దేశ పౌరుల డేటాను విదేశీయులు యాక్సెస్ చేయడానికి వీల్లేదు. ధరణి దోపీడీని మేం బయటపెడితే.. కేసీఆర్ కల్లు తాగిన కోతిలా ఎగురుతున్నారు. 50 వేల కోట్లలో 40వేల కోట్లు ప్రభుత్వానికి వెళ్లాయని కొంతమంది అధికారులు చెబుతున్నారు. ఇది వాస్తవమా.. అవాస్తవమా విచారణ చేపట్టాలి.
కేసీర్, కేటీఆర్ సైబర్ నేరగాళ్లు. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నారు. ధరణిలో జరిగిన 25 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. తక్షణమే ధరణి లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కాగ్ నివేదిక కోరాలని కిషన్ రెడ్డి ని డిమాండ్ చేస్తున్నా. సీసీఎల్ఏ కమిషనర్, చీఫ్ సెక్రెటరీ, సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. దీనిపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే కోర్టు తలుపు తడతాం. దోపిడీ బయటపడుతుందనే నా ఆరోపణలపై కేసీఆర్ తీవ్రంగా స్పందిస్తున్నారు. అందుకే కేసీఆర్ రైతులను, ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ధరణి అనేది కేవలం సాఫ్ట్ వేర్ మాత్రమే కాదు.. అది కేసీఆర్ దోపిడీకి గేట్ వే. లోపాలు లేకుంటే కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దోషిగా నిలబడింది? ధరణి మాస్టర్ కీ శ్రీధర్ రాజు దగ్గర ఉంది. తెలంగాణ భూములన్నీ ఆంధ్రా శ్రీధర్ రాజుకు కట్టబెట్టారు. శ్రీధర్ రాజు ఏ యువరాజుకు దగ్గరి వాడో తేలాలి. చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలి. లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నా కేంద్రం కేసీఆర్ పై ఎందుకు విచారణకు అదేశించడం లేదు? దీని వెనక ఏ గూడుపుఠానీ ఉందో కేంద్ర పెద్దలే చెప్పాలి” అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.