తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఇందిరా పార్క్-వీఎస్టీ మధ్య భారీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

  • Published By: naveen ,Published On : July 11, 2020 / 12:29 PM IST
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఇందిరా పార్క్-వీఎస్టీ మధ్య భారీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో నిర్మించే ఎలివేటెడ్‌ కారిడార్‌ స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శనివారం(జూలై 11,2020) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌, మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు. రూ.426 కోట్లతో ఈ ప్రాంతంలో రెండు ఫ్లై ఓవర్లు నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగిందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకే వివిధ ప్రాజెక్టుల రూపంలో పనులు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం గత ఆరేళ్లుగా హైదరాబాద్ నగరంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. లాక్‌డౌన్ సమయంలో 4 రెట్లు వేగంగా పనులు జరిగాయన్న మంత్రి కేటీఆర్, 9 నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని తెలిపారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ పనులు కూడా త్వరలో చేపట్టి వేగంగా పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని రక్షణ రంగానికి సంబంధించిన స్థలాలు రోడ్డు డెవలప్ మెంట్ కోసం అవసరం అవుతున్నాయని, అందుకు కావలసిన స్థలాలు కూడా ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రక్షణ స్థలాలు వస్తే చాలా స్కై వేలు అందుబాటులోకి వస్తాయన్నారు. కోవిడ్ కట్టడిలో జీహెచ్ఎంసి సిబ్బంది బాగా పనిచేశారని మంత్రి ప్రశంసించారు.

రూ.350 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జి:
రూ.350 కోట్లతో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు ఎలివేటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జి, రెండో దశలో రూ.76 కోట్లతో రాంనగర్‌ నుంచి బాగ్‌లింగపల్లి వరకు మూడు లేన్ల వంతెన నిర్మిస్తామని కేటీఆర్ తెలిపారు. రూ.6వేల కోట్లతో ఎస్సార్‌డీపీ పనులు చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైరదాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. రూ.5 వేల కోట్లతో స్కై వేల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామన్నారు. 18 కి.మీ. చొప్పున రెండు ఎలివేటెడ్‌ కారిడార్లు ప్రతిపాదించామని తెలిపారు.

Punjagutta Steel Bridge to be thrown open today- The New Indian ...

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించుకోవాలి: కిషన్‌రెడ్డి
ఆర్టీసీ క్రాస్ రోడ్ ట్రాఫిక్ సమస్య చాలా కాలం నుంచి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అప్పటినుండి ఇక్కడ ఫ్లైఓవర్ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గతంలో భారీగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఒకటి అన్న కిషన్ రెడ్డి, ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరంలో జనసాంద్రత పెరిగి చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రోడ్లు, ఫ్లైఓవర్ చాలా ముఖ్యమైనవని అన్నారు. నగరంలోకి పెట్టుబడిదారులు మరింత మంది రావాలి అంటే ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా సహకరించుకోవాలని ఆకాంక్షించారు.

రూ.426 కోట్లతో రెండు స్టీల్ బ్రిడ్జిలు:
* రూ.426 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం
* ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో ఎలివేటెడ్‌ కారిడార్‌ స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం
* రూ.350 కోట్లతో 4 లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ స్టీల్‌ బ్రిడ్జి
* ఇందిరాపార్క్‌ రామకృష్ణ మఠం దగ్గర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం
* రెండో దశలో రాంనగర్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు రూ.76 కోట్లతో 3 లేన్ల వంతెన నిర్మాణం.