Telangana Covid 19 : తెలంగాణలో డేంజర్ బెల్స్.. 400 దాటిన కరోనా కొత్త కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొత్త కేసులు 400 దాటడం ఆందోళనకు గురి చేస్తోంది.

Telangana Covid 19 : తెలంగాణలో డేంజర్ బెల్స్.. 400 దాటిన కరోనా కొత్త కేసులు

Telangana Covid 19

Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొత్త కేసులు 400 దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో నిన్న(మార్చి 22,2021) రాత్రి 8 గంటల వరకు 68,171 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. నిన్న కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,674కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉండగా.. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 23,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

వరుసగా 4వ రోజూ 40వేలకు పైగా కొత్త కేసులు:
భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కరోనా పడగ విప్పింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40వేల 715 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోలిస్తే 13శాతం తక్కువ కావడం కొంత ఊరటనిచ్చే అంశం.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 16లక్షల 86వేల 796కి(1.6 కోట్లు) చేరింది. గడిచిన 24 గంటల్లో 199 మంది కరోనాకు బలయ్యారు. దేశంలో కరోనా వెలుగుచూసిన తర్వాత ఇప్పటివరకు లక్షా 60వేల 166మంది కోవిడ్ తో మరణించారు.

క్రితం రోజు 49వేల 951 కరోనా కేసులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. గతేడాది(2020) నవంబర్ నుంచి ఇప్పటివరకు చూస్తే రోజువారీ కేసుల్లో ఈ సంఖ్య అత్యధికం. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ కనిపిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాయి. నైట్ కర్ఫ్యూ పెట్టారు.