Gazette Conflict : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలపై గెజిట్ అమలు చేస్తారా? గడువు ఇస్తారా?
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్రం నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎం.పి. సింగ్ , గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ హాజరవ్వనున్నారు.
Krishna and Godavari river management boards : తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్ర ప్రభుత్వం నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎం.పి. సింగ్ , గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ హాజరు కానున్నారు. కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లో ప్రాజెక్టుల పరిధి, వాటిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సవరణలు తదితర అంశాలతో పాటు ప్రాజెక్టులు వాటి అనుమతులు అంశాలపైనే ప్రధాన చర్చ జరగనుంది.
ఈ ఏడాది జులై 15న కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ నోటిఫికేషన్ అమలుకు ముందు పూర్తి చేయాల్సిన పలు కీలకమైన పనులకు సమయం సరిపోదని, మరికొంత గడువు అవసరం అని రెండు రాష్ట్రాలు ఇటీవల జరిగిన కృష్టా, గోదావరి బోర్డు మీటింగ్స్లో తమ అభిప్రాయాలను వెల్లడించాయి.
Delhi : కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లకు కేంద్రం పిలుపు
అంతేకాకుండా ఢిల్లీలో కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖకు కూడా ఇదే అంశాలపై లేఖ ద్వారా విన్నవించాయి. కృష్ణా, గోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టులకు వచ్చే నెల 14లోపు అనుమతులు పొందాలని, లేకుంటే వాటిని నిలిపివేయాలని గెజిట్లో పెట్టిన నిబంధనల పట్ల రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలుపుతూ ఇందుకోసం మరికొంత గడువు ఇవ్వాలని కోరాయి. కొన్ని ప్రాజెక్టులను షెడ్యూళ్ల నుంచి మార్చాలని ఏపీ, తెలంగాణ కోరాయి.
ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ ఇదే అంశంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు కూడా స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కూడా అవసరమైనంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీంతో నేడు జరుగనున్న మీటింగ్పై ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో ఏం తేలుస్తారనే చర్చ జరుగుతోంది.