40 ఏళ్ల అపార అనుభవంతో 35 రోజుల్లో ఎంత సంపద సృష్టించారు..? సీఎం చంద్రబాబును ప్రశ్నించిన పేర్నినాని

శ్వేతపత్రాలతో కాలయాపన తప్ప ప్రజలకు ఒరిగేది ఏంటి..? ఒక్కరినైనా దోషిగా చూపించగలిగారా..?

40 ఏళ్ల అపార అనుభవంతో 35 రోజుల్లో ఎంత సంపద సృష్టించారు..? సీఎం చంద్రబాబును ప్రశ్నించిన పేర్నినాని

Perni Nani : ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 35 రోజుల్లో ఏం చేశారు..? అని ఆయన సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవంతో 35 రోజుల్లో ఎంత సంపద సృష్టించారు..? అని నిలదీశారు. జగన్ ను దూషించడం తప్ప ఇచ్చిన హామీల అమలు ఎక్కడ..? అని అడిగారు. శ్వేతపత్రాలతో కాలయాపన తప్ప ప్రజలకు ఒరిగేది ఏంటి..? శ్వేతపత్రాల్లో ఒక్కరినైనా దోషిగా చూపించగలిగారా..? అని క్వశ్చన్ చేశారు. అమరావతి, పోలవరం అంటూ హడావిడే తప్ప చేసేదేమీ లేదని విమర్శించారు.

”విద్యుత్ చార్జీల్లో ట్రూ ఆఫ్ చార్జీలు వసూలు చేస్తున్నారు. చెత్త ఎత్తడానికి ఇంటికి 3 రూపాయలు వసూలు చెయ్యమని పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. గతంలో చెత్త ముఖ్యమంత్రి అని తిట్టిన మీరు ఈ 35 రోజుల్లో చెత్తపైన పన్ను ఎక్కడైనా ఆపారా..? జగన్.. చెత్తపై రూపాయి పన్ను వసూలు చేస్తే మీరు 3 రూపాయలు వసూలు చేస్తున్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయే సరికి రాష్ట్ర ఖజానా 100 కోట్లు మాత్రమే. జగన్ దిగిపోయేసరికి 5,655.72 కోట్లు ఖాతాలో ఉన్నాయి. 2014-19 మధ్యలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి అప్పులు మొదలుపెట్టారు. 35 రోజుల్లో ఒక్క రిజర్వ్ బ్యాంక్ నుండి 10 వేల కోట్లు అప్పులు తెచ్చారు.

40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోతున్నారు. రాష్ట్ర అప్పులు కేవలం 4 లక్షల కోట్లు మాత్రమే అని నిర్మలా సీతారామన్ చెప్పారు. మీరు చేసిన 14 లక్షల కోట్ల అప్పుల ప్రచారం బట్టబయలు అవుతుందని బడ్జెట్ పెట్టడం లేదు. ఇచ్చిన హామీలను బడ్జెట్ లో చూపించాలని బడ్జెట్ పెట్టడం లేదు. ఇచ్చిన హామీలు ఎగొట్టడానికి ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ పెట్టాలని చూస్తున్నారు. ఉచిత ఇసుక ఉష్ ఖాకి చేసేశారు. తల్లికి వందనంపై కిందా మీద పడుతున్నారు. ఉచిత బస్సు ఆగస్టు నుండి అని రవాణ మంత్రి కాకుండా ఇంకో మంత్రి చెబుతున్నారు. ఎవరి శాఖ ఎవరిదో తెలియని సర్కస్ ప్రభుత్వంలా ఉంది. అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు.

జగన్ తో సహా అంతా అసెంబ్లీకి వెళ్తారు. విజయసాయిరెడ్డిపై ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు” అని విరుచుకుపడ్డారు పేర్నినాని.

Also Read : ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న విశాఖ ఫైల్స్‌.. వైసీపీ నేతల్లో మరింత టెన్షన్..!