అమరావతి వెళ్లే ప్రజలకు ఆహారం మెనూ ఇదే.. మూడు పూటలా ప్రత్యేక వంటకాలతో.. వేదిక వద్ద పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ..
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు వచ్చే ప్రజలకు మూడుపూటలా ప్రత్యేక మెనూతో ఆహారాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

special food menu
PM Modi Amaravathi Visit: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని.. సాయంత్రం 4.55 గంటల వరకు ఏపీ రాజధాని అమరావతి పర్యటనలో పాల్గొంటారు. అమరావతిలో పునర్నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు.. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ప్రజలను తరలించేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. వీరికి మూడు పూటలా ఆహారం అందివ్వడంతోపాటు.. వేసవి ఎడల నేపథ్యంలో పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, వాటర్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు..
ప్రధాని మోదీ సభకు ప్రజలను తరలించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులతోపాటు ఆర్టీసీ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బస్సులో 120 ఆహార పొట్లాలు, 100 అరటి పండ్లు, 120 తాగునీటి సీసాలు, 60 ఓఆర్ఎస్, 60 మజ్జిగ ప్యాకెట్లతో పాటు కిచిడి, చట్నీ, ఒక ఆరెంజ్ పండు అందించనున్నారు. ప్రతి బస్సులో ప్రభుత్వ సిబ్బంది కూడా ఉంటారు.
మూడు పూటలా ప్రత్యేక మెనూ..
ఎడ వేడిమి నుంచి ఉపశమనం కోసం బహిరంగ సభకు వచ్చే ప్రజలకు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాటు పండ్లు కూడా అందించనున్నారు. అంతేకాక.. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి ఆహారం ఇవ్వనున్నారు.
ఉదయం అల్పాహారంలో..
పులిహోర, రెండు అరటి పండ్లు, రెండు అరలీటరు నీటి సీసాలు, ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్.
మధ్యాహ్న భోజనం..
వెజిటబుల్ బిర్యానీ, రెండు అరటిపండ్లు, ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్, మజ్జిగ, రెండు తాగునీటి సీసాలు.
వేదిక వద్ద స్నాక్స్..
రెండు బిస్కెట్ ప్యాకెట్లు, రెండు నారింజ పండ్లు, ఓఆర్ఎస్ టెట్రా ప్యాకెట్, మజ్జిగ, రెండు తాగునీటి సీసాలు.
రాత్రి డిన్నర్ కోసం..
కిచిడీ, గోంగూర చట్నీ, రెండు తాగునీటి సీసాలు, మజ్జగ ప్యాకెట్ అందిచనున్నారు.