అయ్యో తరుణ్ … అప్పుడే నూరేళ్లు నిండాయా..

కారు యజమాని నిర్లక్ష్యం ఒక చిన్నారి బాలుడి ప్రాణాలు తీసింది. అప్పటివరకు ఆడుకుంటున్న చిన్నారి జీవితం కారు చక్రాల కింద నలిగి పోయింది. కారు రివర్స్ చేసే సమయంలో యజమాని సరిగా గమనించకపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే మహబూబ్నగర్ జిల్లా మాగనూర్ మండలం వదావత్ గ్రామానికి చెందిన రంగప్ప హైదరాబాద్ మల్కాజ్ గిరి, ఆనంద్ బాగ్ లోని వెంకట సాయి ప్లాజా అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు. నెల రోజుల బాబుతోసహా తరుణ్(5) అనే కుమారుడు ఉన్నాడు.. అదే అపార్ట్ మెంట్లో నివాసం ఉండే మనోహర్ అనే వ్యక్తి మర్కెటింగ్ ఎక్జిక్యూటివ్ గా పని చేస్తున్నాడు.
శుక్రవారం బయట నుంచి ఇంటికి వచ్చిన మనోహర్ తన వాగనార్ కారును పార్క్ చేసేందుకు అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి కారుతో వచ్చాడు. అక్కడ కారును పార్క్ చేసే క్రమంలో తన కారును వెనక్కి నడుపసాగాడు. వెనుక తరుణ్ ఉన్నాడన్న విషయాన్ని మనోహర్ గమనించలేదు. ఆ సమయంలో అక్కడే ఉండి ఆడుకుంటున్న తరుణ్ మీదుగా కారు వెళ్లింది.
తీవ్రంగా గాయపడిన తరుణ్ ను వెంటనే తల్లి తండ్రులు, అపార్ట్ మెంట్ వాసులు మనోహర్ కారులోనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు తరుణ్ ని పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. రంగప్ప ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 304 ఎ ప్రకారం మనోహర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.