కాంగ్రెస్ కోసం త్యాగం : ఎన్నికల నుంచి తప్పుకున్నT.TDP

ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేసాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి కలిసి సాగాలా లేదా అనే విషయంపై రెండు పార్టీల్లో క్లారిటీ లేకపోవడంతో.. కాంగ్రెస్ 17 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. దీంతో టీటీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వాస్తవంగా టీడీపీకి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన కేడర్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్లు సాధించకున్నా ఓటు బ్యాంక్ ఉంది. ఒంటరిగానే పోటీ చేద్దామని ఆ పార్టీ మొదట భావించింది. అయితే నేతలు సైకిల్ దిగేస్తుండటంతో డైలమాలో పడింది టీడీపీ. ఈ పరిస్థితుల్లో పోటీకి దిగుతుందా ? అభ్యర్థులను ప్రకటిస్తుందా ? అనే ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకుంది. కాంగ్రెస్కు మద్దతివ్వాలని డిసైడ్ అయ్యింది.
ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు టీడీపీ నేతలు వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలతో అధినేత బాబు మొత్తం ఆ రాష్ట్రంపైనే ఫోకస్ పెడుతుండటంతో.. తెలంగాణ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల బరి నుంచి టీటీడీపీ తప్పుకోవడం ఓ కారణంగా కనిపిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్నేహపూర్వక వైఖరి ఉండేందుకు గానూ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారనే వాదన ఉంది. ఏది ఏమైనా.. పోటీ నుంచి టీటీడీపీ తప్పుకోవడం రాజకీయంగా చర్చనీయంశమైంది.
ఇదిలా ఉంటే తెలంగాణలో టీడీపీ పోటీ చేయకూడదని తీసుకున్న అధిష్టానం నిర్ణయంపై ఆ పార్టీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలుపోటముల విషయం పక్కన పెడితే తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలంటే పోటీ చేయాల్సిందే అని అన్నారు. దీనిపై మార్చి 25వ తేదీ సోమవారం నిర్ణయం తీసుకోవాలన్నారు