కరోనా వ్యాక్సిన్పై మోడెర్నా సంచలన ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు కరోనాకి వ్యాక్సిన్ వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే సంచలన ప్రకటన చేసింది మోడెర్నా సంస్థ. అమెరికన్ మెడిసిన్ తయారీదారు సంస్థ మోడెర్నా తన కరోనా వ్యాక్సిన్ 94.5 శాతం కరోనాపై ప్రభావవంతంగా ఉందని వెల్లడించింది. మోడెర్నా ప్రకటనతో త్వరలో కరోనా వ్యాక్సిన్ ప్రపంచానికి అందుతుందనే ఆశను పెంచింది.
అంతకుముందు, అమెరికాకు చెందిన మరో ఔషద సంస్థ ఫైజర్ కూడా తన టీకా 90 శాతానికి పైగా ప్రభావవంతంగా ఉంటుందని ప్రకటించింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకాతో పాటు మోడెర్నా, ఫైజర్ కూడా ముందంజలో ఉన్నాయి. భారతదేశంలో సీరం, భారత్ బయోటెక్తో పాటు, అనేక కంపెనీలు కూడా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో పాల్గొంటున్నాయి.
కరోనా వైరస్ తొలగించడంలో తన ప్రయోగాత్మక టీకా 94.5 శాతం ప్రభావవంతంగా ఉందని రుజువు చేసినట్లు మోడెర్నా సోమవారం ప్రకటించింది. దాదాపు 30వేల మందిపై క్లినికల్ ట్రయల్ పూర్తి చేసిన తరువాత మోడెర్నా ఈ విషయాన్ని ప్రకటించింది. మూడవ దశ క్లినికల్ ట్రయల్ అధ్యయనం మాకు సానుకూల ఫలితాలను ఇచ్చిందని, టీకా చాలా తీవ్రంగా ఉంది” అని మోడెర్నా CEO స్టీఫెన్ బాన్సెల్ చెప్పారు. కోవిడ్ -19 వ్యాధిని ఆపడంతో టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు.
ఫైజర్ మరియు బయోనోటెక్ కూడా కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉన్నాయని ఇప్పటికే ప్రకటించాయి. రెండు సంస్థలు “ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులో వ్యాక్సిన్ ఉంటుంది” అని ప్రకటించాయి. కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ పరీక్షల డేటాను విడుదల చేసి ఈ మేరకు ప్రకటన చేసింది మోడెర్నా.
ఇక ఫైజర్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీల సెల్షియస్లో నిల్వ ఉంచవలసి ఉన్నట్లు వెలువడిన వార్తలతో ఫార్మా రంగ విశ్లేషకులు ఆ వ్యాక్సిన్తో పెద్దగా దేశంలో ప్రయోజనం ఉండదని అంటున్నారు. దేశీయంగా ఈ వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీ వంటివి సమస్యాత్మకంగా మారనున్నట్లు భావిస్తున్నారు. దీంతో మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్కు ప్రాధాన్యత ఏర్పడింది.