మొన్న నేపాల్…నేడు పాక్ : భారత భూభాగాలను కలుపుకొని కొత్త మ్యాప్ ఆమోదించిన పాకిస్తాన్
భారత్ లో ని జమ్మూ కశ్మీర్, లడఖ్లోని కొన్ని ప్రాంతాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ ప్రభుత్వం కొత్త మ్యాప్ను ఆమోదించింది. ఇది పాకిస్థాన్ ప్రజల ఆక్షాంక్షలను తెలియజేస్తుందని… ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
జమ్మూ కశ్మీర్ను పూర్తిగా భారత్లో విలీనం చేస్తూ ఆర్టికల్ 370ని మోడీ సర్కార్ రద్దు చేసి రేపటితో ఏడాది పూర్తి కానుంది. భారత్ నిర్ణయాన్ని ఏ రకంగానూ ప్రతిఘటించలేకపోయిన పాకిస్థాన్.. తాజాగా జమ్మూ కశ్మీర్, లడఖ్లోని కొన్ని ప్రాంతాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ కొత్త మ్యాప్ను ఆమోదించి తన వక్రబుద్ధిని మరోలా చాటుకుంది.
ఇది పాకిస్థాన్ చరిత్రలోనే కీలకమైన రోజు అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్ ప్రజలతో పాటు కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు ఈ నిర్ణయం తెలియజేస్తోందని ఇమ్రాన్ ఖాన్ చెప్పడం గమనార్హం. ఇప్పటివరకు పాక్ ఆక్రమిత కశ్మీర్తోపాటు గిల్గిల్ బలిస్తాన్ ప్రాంతాలను తమ ప్రాంతాలుగా పేర్కొన్న పాకిస్థాన్… భారత్ ఆధీనంలో ఉన్న కశ్మీర్ను ఆజాద్ కశ్మీర్గా పేర్కొంటూ వచ్చింది.
రెండు నెలల క్రితం నేపాల్ కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకుంది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మూడు పట్టణాలు లిపులేక్, కాలాపాని, లింపియాధురా పట్టణాలను తమవే అంటూ నేపాల్ ఓ కొత్త మ్యాప్ను రిలీజ్ చేసింది. నేపాల్ కొత్త మ్యాప్లో ఏడు ప్రావిన్స్లు, 77 జిల్లాలు, 753 స్థానిక పరిపాలన డివిజన్లు పొందుపరిచారు. అందులో లింపియాధురా, కాలాపాని, లిపు లేక్ కూడా ఉన్నాయి. లిపు లేక్ పాస్ అనేది కాలాపానిలో ఓ భాగం. 2019 నవంబర్లో భారత్ విడుదల చేసిన అధికారిక మ్యాప్లో దాన్ని భారత భూభాగంగా చూపింది. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాలాపాని అనేది ఉత్తరాఖండ్లోని పితోర్ గఢ్ జిల్లాలో భాగమని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు నేపాల్ మాత్రం కాలాపాని అనేది ధార్చులా జిల్లాలో భాగం అని తెలిపింది.