Rahul Gandhi: బైక్ మెకానిక్లా మారిన రాహుల్ గాంధీ .. సుమారు గంటన్నర పాటు కరోల్బాగ్లోనే.. ఫొటోలు వైరల్
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని కరోల్బాగ్ మార్కెట్లోని బైక్ మెకానిక్లను కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు..

Rahul Gandhi
Rahul Gandhi: నిత్యం పార్టీ సభ్యులతో సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా కనిపించే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీ (Delhi) వీధుల్లో బైక్ మెకానిలా మారిపోయారు. రాహుల్ ఓ మెకానిక్ షెడ్లో బైక్ రిపేర్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా రాహుల్ గాంధీనే తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని కరోల్ బాగ్ మార్కెట్లోని బైక్ రిపేరింగ్ దుకాణాలను సందర్శించారు. రాహుల్కు స్థానిక ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. భారత్ జోడో యాత్రలో మాదిరిగానే ప్రజలతో తన పరస్పర సంబంధాలను కొనసాగిస్తూ, కాంగ్రెస్ నేత స్థానిక వ్యాపారవేత్తలు, కార్మికులతో సంభాషించారు. అనంతరం బైక్ మెకానిక్ షెడ్డులోకి వెళ్లి బైక్ రిపేరు చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాహుల్ తన ట్విటర్ ఖాతాలోపంచుకున్నారు. ఈ ఫొటోలలో బైక్ రిపేర్ చేయడం, మెకానిక్ లతో ముచ్చటించడం చూడొచ్చు.

Rahul Gandhi
ఫేస్బుక్లో తన ఫొటోలను షేర్ చేసిన రాహుల్.. ‘రెంచ్లను తిప్పే చేతుల నుండి నేర్చుకోండి మరియు భారత్ చక్రాలను కదిలిస్తూ ఉండండి’ అని రాశారు. రాహుల్ సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కరోల్ బాగ్ ప్రాంతానికి వెళ్లి రాత్రి 7గంటల వరకు అక్కడే గడిపారు. రాహుల్ ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. రాహుల్ ఇటీవల ట్రక్ డ్రైవర్ల సమస్యలను వినేందుకు ఢిల్లీ నుండి చండీగఢ్ వరకు ట్రక్కులో ప్రయాణించారు.