సాగర్ దీవుల వద్ద తీరాన్ని దాటనున్న బుల్ బుల్ తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుపాను తీవ్రరూపం దాల్చి శనివారం రాత్రికి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
తుపాను ప్రభావంతో కోల్ కతా విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులతో పరిస్ధితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు. తుపాను తీరం దాటేటప్పుడు తీవ్రత ఎక్కువవుతుందని ప్రజలు అప్రమత్తతతో ఉండాలని ఆమె కోరారు. రక్షణ,సహాయక చర్యల్లో ప్రభుత్వాధికారులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ బెంగాల్లో NDRF, SDRF దళానికి చెందిన 16 బృందాలను సిధ్ధంగా ఉంచారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎప్పటి కప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.
వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఒకటి బుల్ బుల్ తుపాను లోచిక్కుకుని బోల్తా పడింది. అందులోని 8 మంది మత్స్యకారులు ఒడిషాలోని కలిభంజాదిహా ద్వీపంలో చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న ఒడిషాకు చెందిన SDRF బృందం , స్ధానిక మత్స్య కారులతో కలిసి వారిని రక్షించారు.
తుపాను శనివారం మధ్యాహ్నం ఒడిషాలోని పారాదీప్ కు తూర్పు ఈశాన్యంగా 120 కిలో మీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్లోని సాగర్ దీవులకు 105 కిలోమీటర్లు నైరుతి దిశలోనూ, చందబలికి 110 కిలోమీటర్ల తూర్పు-ఆగ్నేయంగా, బంగ్లాదేశ్ లోని ఖేపుపారా కు పశ్చిమ-నైరుతిదిశగా దిశలో 290 కి.మీ. దూరంలో కేంద్రీ కృతమై ఉంది. బులు బుల్ తుపాను కారణంగా మత్స్యకారులు చేపలువేటకు వెళ్లవద్దని అధికారుల సూచించారు.