SA Bobde : RSS చీఫ్ తో మాజీ సీజేఐ రహస్య భేటీ!
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కలిశారు.
SA Bobde మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కలిశారు. మంగళవారం సాయంత్రం 4-5గంటల సమయంలో నాగ్పుర్లోని మహల్ ఏరియాలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఇరువురూ భేటీ అయినట్లు సమాచారం.
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో మోహన్ భగవత్ ని..జస్టిస్ ఎస్ఏ బోబ్డే కలవడం ఇదే మొదటిసారి. అయితే ఎందుకోసం మాజీ సీజేఐ..మోహన్ భగవత్ తో భేటీ అయ్యారన్నది తెలియరాలేదు. ఇక,ఈ మీటింగ్ గురించి ఆర్ఎస్ఎస్ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక,ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డా. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఇంటిని కూడా మాజీ సీజేఐ సందర్శించినట్లు తెలుస్తోంది.
కాగా,నాగ్ పూర్ కి చెందిన జస్టిస్ బోబ్డే.. న్యాయ విద్య అక్కడే అభ్యసించారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన అనంతరం.. ఆయన నాగ్పుర్లో ఉండేందుకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు.
కాగా,జస్టిస్ ఎస్ఏ బోబ్డే కంటే ముందు సీజేఐగా పదవీ విరమణ చేసిన వ్యక్తి జస్టిస్ రంజన్ గొగొయ్. అయితే అయోధ్య సహా పలు కేసుల్లో కీలక తీర్పులు వెలవరించిన జస్టిస్ రంజన్ గొగొయ్ ని పదవీవిరమణ చేసిన వెంటనే రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.