Jharkhand Elections : రాంచీలో ప్రధాని మోదీ 3కి.మీ భారీ రోడ్షో.. పోటెత్తిన జనం.. ఎక్కడివరకంటే?
Jharkhand Elections : మోదీ చేపట్టిన రోడ్షో 3కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. న్యూ మార్కెట్ చౌక్లో మోదీ రోడ్ షో ముగియనుంది. మోదీని చూసేందుకు వేలాది మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు.

PM Modi takes part in 3 km roadshow in Ranchi ( Image Source : Google )
Jharkhand Elections : జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్లోని రాంచీలో ఆదివారం ఇక్కడ భారీ రోడ్ షో నిర్వహించారు. మోదీ చేపట్టిన ఈ రోడ్షో 3కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. న్యూ మార్కెట్ చౌక్లో మోదీ రోడ్ షో ముగియనుంది.
మోదీని చూసేందుకు వేలాది మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. పూలు, కటౌట్లతో అలంకరించిన బహిరంగ వాహనంపై ప్రధాని కూర్చుని ఉండగా “మోదీ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. గత మే 3న మోదీ మొదటి రోడ్షోను రాంచీలో నిర్వహించగా.. ఇప్పుడు రెండో రోడ్షో చేపట్టారు. పటిష్టమైన భద్రత, భారీ పోలీసు మోహరింపు మధ్య ఓటీసీ గ్రౌండ్లో రోడ్షో ప్రారంభమైంది.
రోడ్షోకి ముందు, ప్రధాని మోదీ రెండు ర్యాలీలలో పాల్గొన్నారు. అందులో ఒకటి బొకారో, మరొకటి గుమ్లాలో మోదీ ప్రసంగించారు. అక్కడ రాష్ట్రానికి సర్వతోముఖాభివృద్ధికి హామీ ఇచ్చారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు తమ మొబైల్ ఫోన్లలో రోడ్షోను తమ ఫోన్లలో చిత్రీకరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. రోడ్షో దృష్ట్యా రాంచీలో ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. అదనంగా, రాష్ట్ర రాజధానిలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల మధ్య అన్ని చిన్న, పెద్ద వాహనాల ప్రవేశాన్ని పరిమితం చేశారు.
జిల్లా యంత్రాంగం బిర్సా ముండా విమానాశ్రయం, సహజానంద్ చౌక్ మధ్య 200 మీటర్ల వ్యాసార్థంలో “నో-ఫ్లైయింగ్ జోన్”గా ప్రకటించింది. డ్రోన్లు, పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్లు ఈవెంట్ వ్యవధిలో ఈ ప్రాంతంలో నిషేధించారు. 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.