నిసర్గ తుఫాన్ : 28 వేల మందికి సోనూసూద్ సాయం

లాక్ డౌన్ కాలంలో వలస కార్మికుల పట్ల నిజమైన హీరోగా నిలిచిన సోనూసూద్…ప్రస్తుతం నిసర్గ తుఫాన్ ప్రభావం నుంచి వేలాది మందిని కాపాడారు. నిసర్గ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ పీటీఐతో మాట్లాడుతూ ‘‘ఈరోజు మనమంతా చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఒకరికొకరం అండగా నిలబడి ధైర్యంగా పోరాడాలి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నేను, నా బృందం తీర ప్రాంతాల్లోని 28 వేల మందికి ఆహారం అందించాం. వారిని సమీపంలోని స్కూల్స్, కాలేజీలు తదితర పునరావాస కేంద్రాలకు తరలించాం. వారంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం’’ అని చెప్పారు.
అలాగే నిసర్గ కారణంగా ముంబాయిలో చిక్కుకుపోయిన 200 మంది అస్సాం వలస కార్మికులను షెల్టర్ హోంకు తరలించినట్లు తెలిపారు. కాగా వలస కార్మికుల తరలింపు విషయంలో చొరవ చూపిన సోనూసూద్ పై ప్రసంశలు జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సోనూసూద్ సాయం పొందిన వారు ఆయనను దేవుడిగా అభివర్ణిస్తున్నారు. నిసర్గ ప్రమాదం పొంచి వున్న తరుణంలోనూ ‘‘నిసర్గ కోసం సోనూసూద్ ఎదురుచూస్తున్నాడు. వెంటనే దానిని ఇంటికి పంపేస్తాడు’’ అంటూ నెటిజన్లు ఛలోక్తులు విసరగా ‘‘రానివ్వండి..పంపేస్తాను’’అంటూ చమత్కారంగా సోనూసూద్ బదులిచ్చారు.
అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్ గా మారిన విషయం తెలిసిందే. ముంబాయికి 100 కిలో మీటర్ల దూరంలోని అలీబాగ్ వద్ద నిసర్గ తుఫాన్ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తీరం దాటే సమయంలో సుమారు 120 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తీవ్రమైన గాలులకు చెట్లు నేల కూలాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే కొన్ని గంటల్లోనే తుఫాన్ ప్రభావం తగ్గిపోవడంతో ముంబాయి వాసులు ఊపిరిపీల్చుకున్నారు.