వారిద్దరి ఆచూకీ తెలిపితే రూ. 7లక్షలు

  • Published By: vamsi ,Published On : January 11, 2020 / 04:44 AM IST
వారిద్దరి ఆచూకీ తెలిపితే రూ. 7లక్షలు

Updated On : January 11, 2020 / 4:44 AM IST

కన్యాకుమారి జిల్లాలోని చెక్‌పోస్టులో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ విల్సన్‌ను తీవ్రవాదులు చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటన జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దులో ఉండగా.. నిందితులు ఆ రాష్ట్రానికి పారిపోయినట్లుగా పోలీసులు భాదిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో పోలీసులు గట్టిగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఎస్‌ఐని కాల్చిచంపిన కేసులో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యకు పాల్పడినవారు కేరళకు పారిపోయేందుకు సహకరించిన నేరంపై కేరళలో ముగ్గురిని, ఢిల్లీలో మరో ఇద్దరిని క్యూబ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కన్యాకుమారి జిల్లా కిళియక్కావిళై మార్కెట్‌ రోడ్డులో పోలీసు చెక్‌పోస్టులో ఎస్‌ఐ విల్సన్‌ విధుల్లో ఉండగా ఇద్దరు అగంతుకులు తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారు. ఈ ఘటనతో కన్యాకుమారి జిల్లా కలెక్టర్, ఎస్పీ, చెన్నై నుంచి డీజీపీ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఐదు ప్రత్యేక పోలీసు బృందాలతో కేసు విచారణ చేపట్టారు. తుపాకీ కాల్పులకు పాల్పడే ముందు ఎస్‌ఐని కత్తులతో పొడిచి చిత్రవధకు గురిచేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. హతుని శీరరం నుంచి తీవ్రవాదులు వినియోగించిన తుపాకీ తూటాలను పోలీసులు సేకరించారు. హత్య జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దు కావడంతో ఆ రాష్ట్ర డీజీపీ, ఇతర పోలీసు అధికారులు సైతం చెక్‌పోస్టును పరిశీలించారు. 

పోలీసు హత్య కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. ఈ క్రమంలో హత్య జరిగిన పరిసరాల్లో సీసీటీవీ కెమెరాల పుటేజీని పరిశీలించిన పోలీసులు.. అందులోని దృశ్యాల ఆధారంగా తిరువితాంగోడుకు చెందిన అబ్దుల్‌ సమీం, నాగర్‌కోవిల్‌కు చెందిన తవుబిక్‌లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. హంతకులు కేరళ పారిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షలు బహుమతి ఇస్తామని తమిళనాడు పోలీసుశాఖ, రూ.5 లక్షలు బహుమానమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.