TDP Janasena Alliance : జనసేనకు 24 కాదు 175 సీట్లు..!- పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పొత్తులో భాగంగా పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించినా.. 175 స్థానాల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీల కార్యకర్తలపై ఉందని చెప్పారు.

Chandrababu Naidu
TDP Janasena Alliance : పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా కానీ.. జనసేనకు ఇచ్చినంత ప్రాధాన్యం ఎవరికీ ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. పొత్తులో భాగంగా పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించినా.. 175 స్థానాల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీల కార్యకర్తలపై ఉందని చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు.. వేమిరెడ్డి రాకతో నెల్లూరు ఎంపీ సీటు గెలుపు సులువైందన్నారు.
”అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. ఎప్పుడూ ఎవరికీ ఇవ్వని గౌరవం ఈరోజు పవన్ కల్యాణ్, జనసేన, జనసేన కార్యకర్తలకు ఇస్తున్నాం. అదీ మా సంప్రదాయం. అదీ ఈ రాష్ట్రం కోసం. ఇద్దరం కలిసి పని చేయాల్సిన ప్రత్యేకత. రెండు పార్టీల ఓట్లలో ఇబ్బంది లేకుండా ట్రాన్సఫర్ చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈ రోజు టీడీపీ అభ్యర్థులు 151 మంది కాదు. 175 మందీ అభ్యర్థులే. జనసేనకు 24 కాదు 175 మందిని గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలు, నాయకులపైన ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడం నూతన ఉత్సాహం నింపింది. ఆయన రాకతో పార్లమెంటులో సునాయాసంగా గెలుస్తున్నాం అనే అభిప్రాయానికి వచ్చాం” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
”ప్రజలకు మరింత సేవ చేసేందుకు నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నా. నెల్లూరు ప్రజల సమస్యలను పార్లమెంటులో చర్చించి తీర్చే విధంగా, నెల్లూరు పార్లమెంటుకు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకరం వచ్చే విధంగా కృషి చేస్తాను” అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
Also Read : వైసీపీలోకి ముద్రగడ..? పిఠాపురంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు