Asia Cup 2025: ఆసియా కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా Vs పాకిస్తాన్ ఫైట్‌కి వేళాయె..

భారత్‌కే ఆతిథ్య హక్కులు ఉన్నప్పటికీ తటస్థ వేదికగా ఆసియా కప్ జరగనుంది.

Asia Cup 2025: ఆసియా కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా Vs పాకిస్తాన్ ఫైట్‌కి వేళాయె..

Updated On : July 26, 2025 / 9:09 PM IST

Asia Cup 2025: మెన్స్ ఆసియా కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ధృవీకరించారు. ”UAEలో జరిగే ACC పురుషుల ఆసియా కప్ 2025 తేదీలను ధృవీకరించడానికి నేను సంతోషంగా ఉన్నాను. ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరుగుతుంది. అద్భుతమైన క్రికెట్ మ్యాచుల కోసం మేము ఎదురుచూస్తున్నాము. త్వరలోనే షెడ్యూల్ విడుదల అవుతుంది” అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడైన మోసిన్ నఖ్వీ తెలిపారు.

ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్‌ ఒకే గ్రూపులోకి వచ్చే అవకాశం ఉందని, చిరకాల ప్రత్యర్థులు తలపడొచ్చని తెలుస్తోంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఇదు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత భారత్, పాకిస్తాన్ కలిసి ఆడబోతున్న టోర్నీ ఇదే.

ఆసియా కప్ 2025ని టీ20 ఫార్మాట్‌లోనే నిర్వహించనున్నారు. 8 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. భారత్‌, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, యూఏఈ, హాంకాంగ్, ఒమన్‌ ఉన్నాయి. మొత్తం 19 మ్యాచులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్, పాకిస్థాన్‌ ఒకే గ్రూప్ లో ఉన్నట్లు సమాచారం. తద్వారా ఇండియా, పాక్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంటుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తోంది. లీగ్ స్టేజ్‌, గ్రూప్ 4 తో పాటు ఫైనల్‌లో తలపడే ఛాన్స్ ఉందని అంచనా.

భారత్‌కే ఆతిథ్య హక్కులు ఉన్నప్పటికీ తటస్థ వేదికగా ఆసియా కప్ జరగనుంది. దీనికి కారణం పహల్గాం ఉగ్రదాడే. ఆ ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో పాక్ జట్టుతో భారత్‌లో మ్యాచ్ ఆడించేందుకు బీసీసీఐ నో చెప్పింది. దీంతో తటస్థ వేదికైన యూఏఈలో ఈ టోర్నీ మొత్తం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నిర్ధారణతో సహా వివరణాత్మక మ్యాచ్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తారు.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2023లో టైటిల్‌ను గెలుచుకున్న భారత్.. ప్రస్తుతం ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. మరోవైపు 2026 ఫిబ్రవరిలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ICC T20 ప్రపంచ కప్‌కు ముందు సన్నాహక టోర్నమెంట్‌గా ఆసియా కప్ ఉపయోగపడనుంది.

Also Read: టెస్టుల నుంచి బుమ్రా రిటైర్‌మెంట్‌.. షాకింగ్ కామెంట్స్ చేసిన కైఫ్..