ఆ జీవోను వెంటనే రద్దు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
రాజకీయ ప్రయోజనాలకోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని, భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar : సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో సీబీఐ రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని లేఖలో బండి సంజయ్ కోరారు. రాజ్యాంగంపై ప్రమాణంచేసి రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘించిన కేసీఆర్, కేటీఆర్ లు ఎమ్మెల్యే పదవులకు అనర్హులు. తెలంగాణ శాసనసభా నాయకుడిగాఉన్న మీరు కేసీఆర్, కేటీఆర్ లను అనర్హులుగా ప్రకటించే విషయంపై స్పీకర్ కు లేఖ రాయాలని అన్నారు. కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని పేర్కొన్నారు.
Also Read : ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ.. గెలుపుపై వైసీపీ ధీమాకు కారణమేంటి? విజయంపై కూటమి కాన్ఫిడెన్స్ ఏంటి?
రాజకీయ ప్రయోజనాలకోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని, భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కారకులు కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచారిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయత పెరిగేది. ఆ పని చేయకపోవడం వల్లే సీబీఐ విచారణ కోరుతున్నాం. ఫోన్ ట్యాపింగ్ అత్యంత తీవ్రమైన నేరం. ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రసాదించిన హక్కులనుకూడా ఫోన్ ట్యాపింగ్ తో కాలరాశారు. భార్యాభర్తలు మాట్లాడుకునే అంశాలనుకూడా ట్యాపింగ్ చేసి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారులు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలుసహా పలువురు సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతోపాటు తమ అవసరాలను తీర్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేకంగా పరికరాలు తెప్పించారని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
Also Read : తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి.. ఇలా అభివృద్ధి..
బీఆర్ఎస్ ఓడిపోయాక ఫోన్ ట్యాపింగ్ పరికరాల ధ్వంసం పేరుతో దేశ భద్రతకు, ఉగ్రవాదులకు సంబంధించిన కీలకమైన సమాచార డేటాను కూడా ధ్వంసం చేశారు. వ్యాపార సంస్థలు ప్రతిపక్షాలకు విరాళాలు ఇవ్వకుండా ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నా ఎందుకు స్వదేశానికి రప్పించలేకపోయారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవాలు నిగ్గు తేలాలంటే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం అనివార్యం. మీరే సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయండి. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయండి. ప్రతిపక్షాలపై సైబర్ దాడికి కారకుడైన మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచారణ జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని లేఖ ద్వారా బండి సంజయ్ కోరారు.