మేము అధికారంలోకి వస్తే ఆ నాయకుల పేర్లను తొలగిస్తాం- కేటీఆర్
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే అర్హత రేవంత్ కు లేదు. గాంధీ విగ్రహం గాడ్సే పెట్టినట్లు ఉంటుంది.

Ktr : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవెళ్లలో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే అర్హత రేవంత్ కు లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ జాతీయ నాయకుల పేర్లను అన్నింటినీ తొలగిస్తామని చెప్పారు.
”రాష్ట్రంలో రూ.370 కోట్ల మిగులు నిధులు ఉన్నాయి. రుణమాఫీ, రైతు బంధు నిధులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అదానీ విషయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదానీపై సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలి. మా హయాంలో అదానీని రాష్ట్రంలో అడుగు పెట్టనియ్యలేదు.
గాంధీ విగ్రహం గాడ్సే పెట్టినట్లు ఉంటుంది…
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీ ఎలా వస్తారు? అదానీ పెట్టుబడులపై రేవంత్ ఒప్పందం చేసుకున్నారు. పార్టీలో పట్టు కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని రేవంత్ అనుకుంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే అర్హత రేవంత్ కు లేదు. గాంధీ విగ్రహం గాడ్సే పెట్టినట్లు ఉంటుంది. మేము అధికారం లోకి వస్తే… కాంగ్రెస్ జాతీయ నాయకుల పేర్లను అన్నింటినీ తొలగిస్తాము. సీఎం రేవంత్ కు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. తెలంగాణలో కాంగ్రెస్ లో రాజ్యసభకు అర్హులు లేరా?” అని ప్రశ్నించారు కేటీఆర్.
సోనియా గాంధీ మీద ఒట్టేసి మరీ చెప్పారు..
”రేవంత్ రెడ్డి వచ్చాక మా బతుకులు ఆగమైనయ్ అని రాష్ట్రంలోని ప్రతి రైతు అనుకుంటున్నాడు. డిసెంబర్ 9 నాడే మొదటి సంతకం రూ.2 లక్షల రుణం ఎత్తేస్తా అంటూ సోనియా గాంధీ మీద ఒట్టేసి చెప్పాడు రేవంత్ రెడ్డి. సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయనుకున్నా. కానీ అవి లేనే లేవు. ఎట్ల రుణమాఫీ చేయలే అన్నట్లుగా మాట మార్చాడు. కొత్తగా వచ్చాడు కదా ఆయనకు కొంత టైమ్ ఇద్దామని మేము కూడా ఎదురుచూశాం. ఇదే రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం పెట్టాడు. 2 లక్షల రుణం మాఫీ కోసం రూ.49 వేల కోట్లు కావాలని బ్యాంకర్లు చెప్పారు. దీంతో తప్పించుకునేందుకు చావు తెలివితేటలు స్టార్ట్ చేయటం మొదలు పెట్టాడు. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే రూ.40 వేల కోట్లు కట్టేస్తా అని 9 వేల కోట్లు కట్ చేసి మీడియా ముందు మాట్లాడాడు.
దైవ ద్రోహం చేశారు..
పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇక ప్రజలు తనను నమ్మరని భావించి.. ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్ట్ 15వ తేదీకి రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. ఆగస్ట్ 15 పోయింది. రుణమాఫీ కాలేదు. దేవుళ్లను కూడా ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు. దైవ ద్రోహం చేసిండు. కేసీఆర్ ను తిట్టి నాలుగు ఓట్లు వేయించుకొని ఆ తర్వాత అవతలపడ్డాడు. ఆ తర్వాత జులైలో మంత్రివర్గంలో చర్చించి ఏదో విధంగా కటింగ్ పెట్టాలని సీఎంకు మంత్రులు సలహా ఇచ్చారు. అందుకే కేబినెట్ లో మీటింగ్ నాటికి దాన్ని రూ.31 వేల కోట్లకు తగ్గించారు. ఇక బడ్జెట్ లో దాన్ని రూ. 26 వేల కోట్లు మాత్రమే పెట్టారు. దీని మీద గట్టిగా అడిగితే చెప్ప చేతకాలేదు.
సీఎం రేవంత్ కి భయం పట్టుకుంది..
సబితక్క.. రేవంత్ రెడ్డికి పాలన చేతనైతలేదని చెబితే కోపం వచ్చి మహిళా శాసనసభ్యులను అవమానించాడు. ఒక ఆడబిడ్డ నాలుగున్నర గంటలు నిలబడి మైక్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఏడిపించి దుర్మార్గంగా వ్యవహారించారు. సబితా ఇంద్రారెడ్డి లాంటి నేతను నిండు శాసన సభలో అవమానించాడు. ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చే సత్తా లేని కారణంగానే ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిందని ఖమ్మం జిల్లాలో సీఎం చెప్పటంతో మొత్తం రైతులు తిరగబడ్డారు. దీంతో రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. నీ సొంత ఊళ్లో రైతులకు వంద శాతం రుణమాఫీ అయినట్లు రైతులు చెబితే రాజీనామా చేస్తా అని నేను సవాల్ చేసినా. నా సవాల్ కు సమాధానం లేదు. స్పందన లేదు.
రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందే..
49 వేల కోట్ల నుంచి 17 వేల కోట్లకు తీసుకొచ్చారు. అదన్నా నిజం అనుకున్నాం. కానీ రైతులకు రూ. 7500 కోట్లు మాత్రమే వేసినం అని డిప్యూటీ సీఎంయే చెప్పారు. ఎక్కడ 49 వేల కోట్లు.. ఎక్కడి రూ. 7500 కోట్లు. అంటే రూ. 7500 కోట్లతోనే దీన్ని ఇక్కడికే ఖతం చేద్దామని స్తున్నారు. రైతన్నలు ఆలోచించాలి. మోసం చేసినోన్ని గల్లా పట్టి నిలదీయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొత్తం రుణం మాఫీ అయితదని అనుకున్నా అని నర్సాపూర్ లో ఒక రైతు చెప్పాడు. 9 నెలల లేటుకు గాను వడ్డీ అడుగుతున్నారంట. రైతుల మిత్తితో సహా ఎలాంటి కొర్రీలు, ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందేనన్నదే మన డిమాండ్.
ఇప్పుడు వదిలేస్తే.. రైతుభరోసాలో కూడా కటింగ్ లు పెడతారు..
రుణమాఫీ లో కటింగ్ పెడితే.. రైతుభరోసాలో కూడా కటింగ్ లు పెడతాడు. మీరు ఇప్పుడు వదిలేస్తే.. తర్వాత కూడా ఇదే విధంగా కోతలు పెట్టుకుంటు పోతాడు. కేసీఆర్ ఉన్నప్పుడు 72 మంది లక్షల రైతులకు రైతు బంధు వేశాం. అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయ్. రుణమాఫీ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మనం అడగాల్సింది అధికారులను కాదు. కాంగ్రెస్ నాయకులను అడగాలె. మనం కచ్చితంగా కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలను గల్లా పట్టి నిలదీయాలి. అధికారులు చుట్టూ తిరగాల్సిన గర్జు మనకెందుకు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే మా తరఫున పోరాటం చేయమని అడగాలె. ఇవాళ్టి పోరాటం మొదటి అడుగు మాత్రమే.
ఒక్కరైనా మీ పాలనను మెచ్చుకుంటున్నారా?
రైతులందరికీ మొత్తం రూ.2 లక్షలు రుణం మాఫీ చేసే వరకు వదిలిపెట్టాం. మాటలు చెప్పినంత ఈజీ కాదు.. ప్రభుత్వాన్ని నడపటం. చెట్టుకు కట్టేసి కొడుతా, తొండలు జొర్రకొడుతా అని గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన చెప్పిన హామీలు నేరవేర్చకుంటే అదే పని ఆయనకు చేస్తారు. ఏ ఊరిలోకి అయినా సరే వెళ్లి అడుగుదాం.. ఒక్కరైనా నీ పాలనను మెచ్చుకుంటున్నారా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో మీరే ఆలోచించాలి. అన్ని ప్రాజెక్ట్ లు రద్దు చేసి ప్రజలను ఆగం చేస్తుండు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు. భారత రైతు సమితి కూడా.
అప్పటివరకు పోరాటం ఆపేది లేదు..
మొత్తం రైతులందరికీ రుణమాఫీ అయ్యేవరకు పోరాటం ఆపేది లేదు. ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు. నీ ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్ల మీద కూడా వెంటపడుతాం. మీరు ఇచ్చిన ఏ హామీకి సంబంధించి అయినా సరే మిమ్మల్ని వెంటాడటమే. ప్రజాస్వామ్యబద్దంగా ఒక్కటై కాంగ్రెస్ 420 హామీలను ప్రజల ముందు పెడదాం. రేవంత్ రెడ్డి లా మనం బజారు బాష మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే” అని కేటీఆర్ తేల్చి చెప్పారు.
Also Read : హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఫామ్హౌసేనా? హైడ్రా అసలు లక్ష్యం ఏంటి..