Rahul Gandhi : సీఎం కేసీఆర్పై ఎందుకు కేసులు, దాడులు లేవు? రాహుల్ గాంధీ
దేశంలో ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిపై ఎలాంటి కేసులు ఉండవు. Rahul Gandhi

Rahul Gandhi Slams KCR
Rahul Gandhi Slams KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తెలంగాణను కేసీఆర్ ఆయన కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొత్తు కేసీఆర్ కుటుంబసభ్యులకే చేరుతోందన్నారు. రెవెన్యూ, ఇసుక, మద్యం ఇలా అన్ని శాఖలు ఆ కుటుంబం వద్దే ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజా తెలంగాణ కోసం మనం పోరాడాం, దొరల తెలంగాణ కోసం కాదు అని రాహుల్ అన్నారు. పాలమూరు ప్రజాభేరి పేరుతో కొల్లాపూర్ లో కాంగ్రెస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
‘ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు మరోవైపు తెలంగాణ సమాజం, నిరుద్యోగులు, మహిళలు ఉన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతోందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం అతిపెద్ద మోసం కాళేశ్వరం ప్రాజెక్ట్. బీజేపీ, బీఆర్ఎస్.. తెలంగాణ ప్రజల లక్ష కోట్ల రూపాయలు దోచేశాయి. తెలంగాణ ప్రజలు, రైతులు, సామాన్య ప్రజల సొమ్మును దోచుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోతున్నయి. వాళ్ళు దోచుకున్న డబ్బుకు ప్రతి ఏటా 2040 వరకు 31వేల రూపాయలు ప్రతి కుటుంబం కట్టాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో అనేక సాగు ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు, వీళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చూడండి. దళితులు, ఆదివాసీలు, పేదల భూములు కాంగ్రెస్ నేతృత్వంలో తిరిగి ఇచ్చాం. చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని భూములు ఇస్తే వాటిని ధరణి పేరుతో గుంజుకుంటున్నారు. వారి కుటుంబానికి, బంధువులు, ప్రజా ప్రతినిధులకు మాత్రమే ధరణి లబ్ధి చేస్తోంది. తెలంగాణ ప్రజల సొత్తు కేసీఆర్ కుటుంబ సభ్యులకే చేరుతోంది. రెవెన్యూ, ఇసుక, మద్యం అన్ని శాఖలు ఆ కుటుంబం వద్దే ఉన్నాయి.
ప్రజా తెలంగాణ కొరకు మనం పోరాడాం. దొరల తెలంగాణ కోసం కాదు. తెలంగాణ ఉద్యమ కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేయబోతుంది. బీజేపీ, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయి. లోక్ సభలో బీజేపీకి కేసీఆర్ పూర్తి మద్దతు ఇచ్చారు. జీఎస్టీ, రైతు చట్టాల బిల్లులకు కేసీర్ మద్దతిచ్చారు. దేశంలో ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిపై ఎలాంటి కేసులు ఉండవు. ఈ రెండు పార్టీల లక్ష్యం కాంగ్రెస్ పార్టీనీ గెలవనివ్వకూడదు అనేదే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బీజేపీ కోసం ఎంఐఎం పార్టీ పని చేస్తోంది.
ఇక్కడ బీఆర్ఎస్ తో పోటీ చేస్తుంటే మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీతో పోట్లాడుతున్నాం. తెలంగాణ ప్రజలు మనసులో నిర్ణయం తీసుకున్నారు. అధికారం, మీడియా సీఎం వెంట ఉంటే ప్రజల విశ్వాసం కాంగ్రెస్ కు ఉంది. కాంగ్రెస్ కార్యర్తలు ఎవరికీ భయపడరు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కలిసి ప్రజా తెలంగాణ సాకారం చేయాల్సిన అవసరం ఉంది.
Also Read : నేను గెలిస్తే వాళ్ల దోపీడీ ఉండదు.. ఎన్నికల ప్రచారంలో తుమ్మల సంచలన వ్యాఖ్యలు..
మాది రాజకీయ బంధం కాదు కుటుంబ బంధం. ఇందిరా గాంధీకి అత్యవసర పరిస్థితి వస్తే తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారు. ఈ నిజాన్ని నేను ఎప్పటికీ మరవలేను. మీ పోరాటాన్ని చూసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. అన్ని వర్గాలకు తెలంగాణ ప్రయోజనాలు దక్కుతాయని ఆశించాం. కేవలం ఒకే కుటుంబం ఆ ప్రయోజనాలన్నీ అనుభవిస్తోంది. మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేస్తాం. కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఇలా కాంగ్రెస్ అధికారం పొందిన రాష్ట్రాల్లో మొదటి కేబినెట్ భేటీలోనే హామీలపై నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ప్రజల సొమ్ము సీఎం కేసీఆర్ ఎంత దోచుకున్నారో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ సొమ్మును మీ జేబులో వేస్తాం” అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.