గాంధీలో కరోనా వార్డులు..విదేశాలకు వెళ్లొచ్చినవారిలో లక్షణాలు ఉన్నోళ్లకు ఒకచోట…లేనోళ్లకు మరో చోట

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డులో మార్పులకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు 14 రోజులు ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 03:22 PM IST
గాంధీలో కరోనా వార్డులు..విదేశాలకు వెళ్లొచ్చినవారిలో లక్షణాలు ఉన్నోళ్లకు ఒకచోట…లేనోళ్లకు మరో చోట

Updated On : March 7, 2020 / 3:22 PM IST

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డులో మార్పులకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు 14 రోజులు ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డులో మార్పులకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఇతరులు ఎవరూ గాంధీలోని ఏడో ఫ్లోర్ కు వెళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు 14 రోజులు ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గాంధీ కరోనా వార్డులో రెండు విభాగాలను ఏర్పాటు చేశారు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉన్న వాళ్లను ఒకచోట, విదేశాలకు వెళ్లి వచ్చినా కూడా కరోనా లక్షణాలు లేకపోతే మరో వార్డులో ఉంచాలని ఆదేశించారు. శనివారం (మార్చి 7, 2020) జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి ఈటల ఈ ఆదేశాలు జారీ చేశారు.

కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించిన ఈటల
అంతకముందు మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ వ్యక్తిని పరామర్శించారు. అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా వైరస్ అనుమానంతో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వార్డుల్లో ఉన్న వ్యక్తులను కూడా మంత్రి పరామర్శించారు. స్వయంగా వారితో మాట్లాడారు. కరోనా వైరస్ పేషెంట్ల దగ్గరున్న సమయంలో మాత్రమే మంత్రి మాస్కు ధరించారు. ఆ తర్వాత దాన్ని తీసేసి హాస్పిటల్ లో తిరిగారు. మాస్కు ధరించకపోతే కరోనా సోకుతుందనే భయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. పేషెంట్లతో నేరుగా మాట్లాడిన మంత్రి వారిలో ధైర్యం నింపారు.

కరోనా సోకిన వ్యక్తి తుంపర్ల ద్వారా మాత్రమే మరొకరికి వ్యాప్తి  
కరోనా వైరస్ సోకిన వ్యక్తుల డ్రాప్ లెట్స్(తుంపర్లు) ద్వారా మాత్రమే మరొకరికి కరోనా సోకుతుంది తప్ప గాంధీ ఆసుపత్రిలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం లేదని మంత్రి చెప్పారు. వేర్వేరు వార్డుల్లో ఉన్న పేషెంట్లతో మాట్లాడిన మంత్రి ఈటల, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఉన్న 7 ఫ్లోర్లు ఆయన తిరిగారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందని మంత్రి ఈటల అన్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉంది తప్ప.. ఐసోలేషన్ వార్డులో తిరిగితే సోకదన్నారు.

కరోనా వార్డుల్లో ఏర్పాట్లపై డాక్టర్లతో మంత్రి ఈటల చర్చ
కరోనా వార్డుల్లో ఏర్పాట్లపై డాక్టర్లతో మంత్రి ఈటల రాజేందర్ చర్చించారు. కరోనా వైరస్ బాధితుల చికిత్స కోసం ఏర్పాటు చేసిన వార్డుకు వెళ్లే దారిలో ఇతరులను అనుమతించొద్దని ఆదేశాలు ఇచ్చారు. లిఫ్ట్ కూడా వైరస్ సోకిన వారిని తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగించాలన్నారు. కరోనా వైరస్ సోకిన వారిని ఉంచే వార్డులకు వెళ్లడానికి వీలు లేకుండా దారులు మూసేయాలన్నారు. 

కరోనా విషయంలో సంయమనం పాటించాలి
ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటేషన్ సిబ్బంది లిఫ్ట్ లను, వార్డులను ఆల్కహాల్ బేస్డ్ క్లీనర్లతో శుభ్రం చేయాలన్నారు. ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నవారిలో చాలామంది ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నారు. దాంతో వారికి వైఫై సౌకర్యం కల్పించాలని మంత్రి చెప్పారు. కరోనా విషయంలో మీడియా సంయమనం పాటించాలన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైందని తెలిపారు.