పేదోళ్లే టార్గెట్ : విశాఖలో కిడ్నీ రాకెట్

వారికి పేదోళ్లే టార్గెట్. ఆర్థిక అవసరాలతో ఇబ్బందులు పడుతున్న వారిని ట్రాప్ చేస్తారు. వారి కిడ్నీలను దోచేస్తారు. విశాఖ పట్టణంలో కిడ్నీ రాకెట్ ముఠా బట్టబయలైంది. ఆర్ధిక అవసరాలు ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్ గా కిడ్నీ రాకెట్ దందాను నడిపిస్తున్నారు. ఈ రాకెట్లో పలువురు దళారీలు, పలు ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధం ఉందని తేలింది. విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆలస్యంగా కిడ్నీ రాకెట్ ఆగడాలు వెలుగు చూశాయి.
కూకట్ పల్లికి చెందిన పార్థసారధి సెక్యూర్టీగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతనికి డబ్బు అవసరం పడింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి పార్థసారధితో మాట్లాడాడు. కిడ్నీ ఇస్తే రూ. 12 లక్షలు ఇస్తామంటూ ఆశ చూపించాడు దళారి. కిడ్నీ తీసుకున్న తర్వాత కేవలం రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. శ్రద్ధ హాస్పిటల్ ఆస్పత్రి యాజమాన్యం పత్రాలను ఫోర్జరీ చేసి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశారు.
ఈ కిడ్నీ ప్రభాకర్ అనే వ్యక్తికి అమర్చారు. మోసం చేశారంటూ పార్థసారధి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మహరాణిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ 1గా మంజునాథ్, ఏ 2గా పేషెంట్ ప్రభాకర్, ఏ 3గా శ్రద్ధ హాస్పిటల్, ఏ 4గా వెంకటేష్లుగా కేసులు నమోదు చేశారు. మంజునాథ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.