WTC Points table : టీమ్ఇండియా కొంపముంచిన దక్షిణాఫ్రికా నిర్ణయం! రెండు రోజుల్లోనే మూడో స్థానానికి..
డబ్ల్యూటీసీ 2023-2025 సీజన్లోని మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
![WTC Points table : టీమ్ఇండియా కొంపముంచిన దక్షిణాఫ్రికా నిర్ణయం! రెండు రోజుల్లోనే మూడో స్థానానికి.. WTC Points table : టీమ్ఇండియా కొంపముంచిన దక్షిణాఫ్రికా నిర్ణయం! రెండు రోజుల్లోనే మూడో స్థానానికి..](https://10tv.in/wp-content/uploads/2024/02/New-Project-32-1.jpg)
WTC Points table 2023-2025
WTC Points table 2023-2025 : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 సీజన్లోని మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గత రెండు సీజన్లకు భిన్నంగా ఈ సారి మొదటి రెండు స్థానాల కోసం జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విశాఖలో టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించిన భారత్ డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. అయితే.. ఆ మురిపం రెండు రోజులే ఉంది. ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది.
రెండు టెస్టు మ్యాచుల సిరీస్లో భాగంగా స్వదేశంలో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికా పై న్యూజిలాండ్ 281 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సైకిల్లో ఇప్పటి వరకు మూడు టెస్టులు ఆడిన కివీస్ రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్లో ఓడిపోయింది. 66.66 విజయ శాతం, 24 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచింది.
Jasprit Bumrah : చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. మొదటి భారత పేసర్
10 మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా ఆరు మ్యాచుల్లో గెలిచింది. మరో మూడు మ్యాచుల్లో ఓడిపోగా, ఓ మ్యాచ్ను డ్రా చేసుకుంది. దీంతో 55 విజయ శాతం 66 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఇక భారత్ ఈ సైకిల్లో ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడింది. ఇందులో మూడు మ్యాచుల్లో గెలవగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది మరో మ్యాచ్ను డ్రా ముగించింది. 52.77 విజయశాతం, 38 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
దక్షిణాఫ్రికా తీసుకున్న ఆ నిర్ణయం..
న్యూజిలాండ్ పర్యటనకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అనుభవం లేని ఆటగాళ్లను పంపించింది. 14 మంది సభ్యులు గల బృందంలో దాదాపు సగం మందికి పైగా ఆటగాళ్లు అరంగ్రేటం చేయనివారే కావడం గమనార్హం. ఇందులో కెప్టెన్ నీల్ బ్రాండ్ కూడా ఉండడం గమనార్హం. సౌతాఫ్రికా టీ20 లీగ్ కోసం స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. అప్పట్లోనే దీనిపై విమర్శలు వచ్చాయి. క్లిష్టమైన షెడ్యూల్ కారణంగానే ఇలా చేయాల్సి వచ్చిందని దక్షిణాఫ్రికా బోర్డు వివరణ ఇవ్వడంతో విమర్శలు సద్దుమణిగాయి. అయితే.. దక్షిణాఫ్రికా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా టీమ్ఇండియాతో పాటు మిగిలిన జట్ల పై గట్టి ప్రభావమే పడుతోంది.
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫిబ్రవరి 13 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. అనుభవం లేని దక్షిణాఫ్రికాతో పోలిస్తే ఈ మ్యాచులోనూ కివీసే ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఈ మ్యాచ్లో కివీస్ విజయం సాదిస్తే అప్పుడు కివీస్ విజయ శాతం 75 శాతానికి చేరుకుంటుంది. ఇది అటు టీమ్ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లపై ప్రభావాన్ని ఖచ్చితంగా చూపనుంది.