హై అలర్ట్ : షార్ దగ్గర ముమ్మర తనిఖీలు

  • Published By: chvmurthy ,Published On : September 13, 2019 / 06:20 AM IST
హై అలర్ట్ : షార్ దగ్గర ముమ్మర తనిఖీలు

దక్షిణ తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు సముద్రతీరం వెంబడి గస్తీ ముమ్మరం చేశారు. మెరైన్‌ పోలీసు స్టేషన్లతోపాటు కోస్ట్‌ గార్డ్‌ను అప్రమత్తం చేశారు. 

ముఖ్యంగా నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్‌ సెంటర్‌ ప్రాంతంలో నిఘా పెంచారు. బంగాళాఖాతంలో 50 కి.మీ. మేర సిఐఎస్‌ఎఫ్, మెరైన్‌ పోలీసుల తనిఖీలు చేపట్టారు. షార్‌  సమీపంలోని శ్రీహరి కోట అడవుల్లో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సంచార వాహనాలతో గస్తీ ముమ్మరం చేశారు. కొత్త వారి కదలికపై నిఘా పెట్టారు. 

షార్‌కు వచ్చి వెళ్లే అన్ని వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. శ్రీహరికోట తీరంలో తిరిగే పడవలపై నిఘా పెట్టారు. మత్స్యకారులతోపాటు తీరంలో తిరిగే పడవల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వేనాడు దర్గాకు వచ్చే వాహనాలను భద్రతా బలగాలు తనిఖీ చేస్తున్నారు.