Uttar Pradesh IT Raids : యూపీలో ఐటీ దాడులు.. మాజీ సీఎం అఖిలేశ్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు
వారణాసికి చెందిన ఆదాయపు పన్ను శాఖకు చెందిన 12 మంది సభ్యుల బృందం తూర్పు యూపీలోని మౌ జిల్లాలోని సహదత్పురా ప్రాంతంలోని రాజీవ్ రాయ్ నివాసం వద్ద తనీఖీలు చేస్తోంది.
Uttar Pradesh IT Raids : మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి ఇళ్ళపై ఆదాయపు పన్నుశాఖ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కి అత్యంత సన్నిహితుడు, పార్టీ అధికార ప్రతినిధి మౌలోని రాజీవ్రాయ్ నివాసంలో శనివారం ఉదయం ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అఖిలేశ్ కుటుంబానికి మంచి పట్టువున్న మెయిన్పురిలో మరో ఎస్పీ నేత ఇంట్లోనూ ఈ సోదాలు జరిగాయి. ఆగ్రాలోని మనోజ్ యాదవ్, లక్నోలోని నీతూ యాదవ్. అకా జైనేంద్ర యాదవ్, ఇళ్ళపై ఐటీ అధికారులు దాడులు చేశారు.
వారణాసికి చెందిన ఆదాయపు పన్ను శాఖకు చెందిన 12 మంది సభ్యుల బృందం తూర్పు యూపీలోని మౌ జిల్లాలోని సహదత్పురా ప్రాంతంలోని రాజీవ్ రాయ్ నివాసం వద్ద తనీఖీలు చేస్తోంది. రాజీవ్ రాయ్ సమాజ్ వాదీ పార్టీ కార్యదర్శి మరియు అధికార ప్రతినిధి. రాజీవ్రాయ్కి చెందిన సంస్థ.. కర్ణాటకలో చాలా విద్యాసంస్థలను నడుపుతోంది. ఈ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలతో అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ దాడులను రాయ్ తీవ్రంగా ఖండించారు. నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు. నా వద్ద బ్లాక్ మనీ కూడా లేదు. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ప్రభుత్వానికి అది నచ్చడం లేదు. దాని ఫలితమే ఇది .. అని రాయ్ ఐటీ దాడులపై వ్యాఖ్యానించారు. సమాజ్వాద్ పార్టీ జాతీయ కార్యదర్శి కూడా పని చేస్తున్నరాయ్ 2012 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పార్టీ అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు.
2014 ఎన్నికల్లో ఘోసి నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అఖిలేష్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాయ్ నివాసంలో ఆకస్మిక ఐటీ సోదాలు.. ప్రభుత్వం కుట్రే అని సమాజ్వాది పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
లక్నోలోని విశాల్ ఖండ్ ప్రాంతంలోని నీతూ యాదవ్ ఇంటిలోనూ సోదాలు జరుగుతున్నాయి. అఖిలేష్ యాదవ్ యూపీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా ఉన్నారు. ఇక అఖిలేష్ మరో సన్నిహితుడు మెయిన్పురి, ఆగ్రాలోని ఆర్సీఎల్ గ్రూప్ యజమాని మనోజ్ యాదవ్కు చెందిన ఇళ్లల్లోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. మెయిన్పురిలో ఐటీ అధికారులు 10 వాహనాలతో వచ్చి మనోజ్ యాదవ్ నివాసాన్ని సీజ్ చేశారు.
Also Read : T.Congress : డి.శ్రీనివాస్ కొడుకు కూడా కాంగ్రెస్ లో చేరాలి – వీహెచ్
ఐటీ దాడులపై మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ…. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు బీజేపీకి చెందిన నాయకులు యూపీకి వస్తారని తాను ఎప్పటి నుంచో చెపుతున్నానని వ్యంగ్యంగా అన్నారు. ఇప్పడు ఆదాయపన్ను అధికారులు వచ్చారు, తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, తర్వాత సీబీఐ ఆ తర్వాత ఇతర ఏజెన్సీలు వరసగా వస్తాయని అఖిలేష్ అన్నారు.