Covid Variants : షాకింగ్.. గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్లు
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వెలుగులోకి వచ్చిందో కానీ, ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్న
Covid Variants : కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వెలుగులోకి వచ్చిందో కానీ, ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. కరోనా కొత్త వేరియంట్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో చేసిన ఒక అధ్యయనంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.
తొలిగా ప్రపంచంలో విజృంభించిన కరోనా వైరస్తో పోలిస్తే కొత్తగా వస్తున్న వేరియంట్లు గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తున్నాయని ఈ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఒరిజినల్ కరోనా సోకిన వారితో పోలిస్తే ఆల్ఫా వేరియంట్ సోకిన వారి ఊపిరి ద్వారా 43 నుంచి 100 రెట్లు అధికంగా వైరస్ క్రిములు గాల్లో ప్రవేశిస్తున్నాయని సైంటిస్టులు తెలిపారు. డెల్టా వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తోందంటే ఇది సోకిన వారి నుంచి గాల్లోకి మరింత ఎక్కువ వైరస్ చేరుతున్నట్లేనని అంటున్నారు.
Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే
కరోనా పేషెంట్లు వదులుగా ఉండే మాస్కులు, సర్జికల్ మాస్కులు ధరించడం వల్ల వారి నిశ్వాసలో ఉండే కరోనా క్రిముల్లో 50 శాతం మాత్రాన్ని అవి నిరోధిస్తున్నాయని పరిశోధకులు చెప్పారు.
కరోనా సోకిన వారు టైట్గా ఉండే మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తిని మరింత ఎక్కువగా నియంత్రించవచ్చని వారు అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు ఇలా మాస్కులు ధరించడం, ఇళ్లలో వెంటిలేషన్ సదుపాయం సక్రమంగా ఉండేలా చూసుకోవడం వల్ల కరోనాను నియంత్రించవచ్చని అన్నారు.
”గాలి ద్వారా సంక్రమించేలా కరోనా రూపాంతరం చెందుతోంది. కొత్త వేరియంట్లు క్రమంగా గాలి ద్వారా ప్రయాణించే సామర్థ్యాన్ని మెరుగు పరచుకుంటున్నాయి. అందువల్ల గదుల్లో వెంటిలేషన్ బాగుండాలి. ముఖానికి సరిగా అమరే మాస్కులు ధరించాలి. దీనికితోడు టీకాలను పొందితే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు” అని సైంటిస్టులు తెలిపారు.
SBI Warning : ఆ నంబర్లతో జాగ్రత్త.. ఖాతాదారులకు SBI హెచ్చరిక
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జులై నుంచి కేసులు తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ 2వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. కొవిడ్తో శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. కరోనా మరణాలు ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదవుతున్నాయి. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్గా తెలుస్తోంది.
భారత్ లోనూ కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30వేల 256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరో 295 మంది కొవిడ్ తో మరణించారు. ఒక్క కేరళలోనే తాజాగా 19వేల 653 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 152 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 3,34,78,419కి చేరింది. అలాగే, నిన్న 43,938 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,45,133కి పెరిగింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,27,15,105 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,18,181 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 37,78,296 వ్యాక్సిన్ డోసులను వేశారు. ఇప్పటివరకు మొత్తం 80,85,68,144 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.