అజంఘర్ ఆశీర్వదిస్తుంది :నామినేషన్ వేసిన అఖిలేష్ యాదవ్

  • Published By: venkaiahnaidu ,Published On : April 18, 2019 / 09:58 AM IST
అజంఘర్ ఆశీర్వదిస్తుంది :నామినేషన్ వేసిన అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ లోని అజంఘర్ లోక్ సభ స్థానానికి ఎస్పీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం(ఏప్రిల్-18,2019)నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే ముందు లక్నోలో అఖిలేష్ రోడ్ షో నిర్వహించారు.పెద్ద ఎత్తున ఎస్పీ కార్యకర్తలు,అభిమానులు రోడ్ షోలో పాల్గొన్నారు. ఇటీవల ఎస్పీలో చేరి లక్నో ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శతృఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

మద్దతుదారుల కోలాహలం మధ్య నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అఖిలేష్ మాట్లాడుతూ…అజంఘర్ అభివృద్ధి కోసం కోసం ఎంతో కృషి చేశామని,భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తామని అన్నారు.మొదటి దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా యూపీలో జరిగిన పార్లమెంట్ స్థానాల్లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్ డీ కూటమికి ప్రజలు అనుకూలంగా ఓటు వేశారని అఖిలేష్ అన్నారు.రెండో దశ పోలింగ్ కూడా తమ కూటమికి అనుకూలంగా ఉంటుందని అన్నారు. అజంఘర్ ప్రజలు సమాజ్ వాదీలకు(సోషలిస్టులు)ఆశ్వీర్వాదం అందిస్తారని తెలిపారు.

కొన్నేళ్లుగా అజంఘర్ లోక్ సభ స్థానం ఎస్పీకి కంచుకోటగా ఉంది.2014లో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అజంఘర్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.అయితే కుమారుడి కోసం ఈసారి ములాయం తన సిట్టింగ్ స్థానాన్ని వదిలిపెట్టి మెయిన్ పురి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.