Assam CM : రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్ తగులబెట్టిన అసోం సీఎం
కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను తగులబెట్టారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.
Assam CM కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను తగులబెట్టారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. గత మూడు నెలలుగా పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.163.58 కోట్ల విలువైన డ్రగ్స్ను శని, ఆదివారాల్లో డిఫు, గోలఘాట్, బర్హంపూర్, హజోయి,నాగాన్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో సీఎం ధ్వంసం చేశారు.
ఆదివారం నాగాన్లో నిర్వహించిన డ్రగ్స్ డిస్పోజల్ కార్యక్రమంలో సీఎం శర్మ స్వయంగా బుల్డోజర్ నడిపి డ్రగ్స్ను ధ్వంసం చేశారు. దీంతో అక్రమ డ్రగ్ డీలర్స్పై కఠినంగా వ్యవహరిస్తామన్న సందేశాన్ని ఇచ్చారు. అసోం యువకులు నిషిద్ధ డ్రగ్స్ కి బలైపోతున్నారని,మత్తు పదార్ధాల కోసం అస్సాంని రవాణా మార్గంగా ఉపయోగించడాన్ని తాము ఏ మాత్రం సహించోమని సీఎం హిమంత బిస్వా శర్మ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.
అసోం నుంచి భారత భూభాగంలోకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని..సరఫరా లైన్ ని కట్ చేయడం మరియు ఉత్పత్తిని ఆపడం తన జాతీయ బాధ్యత అని సీఎం తెలిపారు. అక్రమ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి( మే -10,2021 నుంచి) జూలై 15 మధ్యకాలంలో అసోం పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం 874 కేసులను నమోదు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 1,493 మంది మాదకద్రవ్యాల డీలర్లను అరెస్టు చేసి, దాదాపు రూ. 163 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారని హిమంత బిశ్వ శర్మ తెలిపారు.