Corona Cases: కరోనా వీరవిహారం.. నిమిషానికి 10కొత్త కేసులు
Corona Cases:కరోనా సెకండ్ వేవ్ విసురుతున్న సవాల్కు దాదాపు అన్ని రాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్నాయి. వైరస్ ఉధృతికి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు ఏ మాత్రం సరిపోవడంలేదు. మహారాష్ట్రలో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది.
కర్ణాటకలో కూడా నిమిషానికి 10 కొత్త కేసులు నమోదవుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాజధాని బెంగళూరులో ప్రతి నిమిషానికి సుమారు 7 పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి.
బెంగళూరులో ప్రతిరోజు 7 నుంచి 10 వేల పాజిటివ్ కేసులు బయటపడుతుండగా.. గంటకు ఒక కరోనా మరణం నమోదవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు నాటికి రోజుకు సుమారు 200 మరణాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. నైట్ కర్ఫ్యూతో పాటు కొన్ని కరోనా ఆంక్షలు కొనసాగుతన్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరిన్ని ఆంక్షలు పెట్టేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
పూర్తిస్థాయి లాక్డౌన్ పెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నా… ప్రభుత్వంలోని కొంతమందితో పాటు విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో లాక్డౌన్ పేరెత్తకుండా ఆ స్థాయి ఆంక్షలను విధించే ఆలోచనలో ఉంది కర్నాటక ప్రభుత్వం.