Ghulam Nabi Azad: కాంగ్రెస్కు నా రక్తం ఇచ్చాను.. కానీ, నన్ను మర్చిపోయింది: గులాంనబీ ఆజాద్
తాను కాంగ్రెస్ పార్టీకి రక్తం ధారపోస్తే, ఆ పార్టీ తాను చేసిన సహాయాన్ని మర్చిపోయిందని విమర్శించారు గులాంనబీ ఆజాద్. కొత్త పార్టీ పెట్టబోతున్న ఆయన జమ్ము-కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీకి తాను రక్తం ధారపోస్తే, తనను ఆ పార్టీ మర్చిపోయిందని విమర్శించారు గులాంనబీ ఆజాద్. ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్ నేతగా కొనసాగిన గులాంనబీ ఆజాద్ ఇటీవల ఆ పార్టీకి గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. తన సొంత రాష్ట్రం జమ్ము-కాశ్మీర్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు.
దీనిలో భాగంగా ఆదివారం ఆయన కాశ్మీర్ చేరుకున్నారు. ఇక్కడ్నుంచే తన నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు. అక్కడ మెగా ర్యాలీ నిర్వహించిన ఆజాద్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తాను రక్తం ధారబోస్తే, తాను చేసిన సహాయాన్ని ఆ పార్టీ మర్చిపోయిందని వివరించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ మాలాంటి నాయకుల రక్తం వల్ల తయారైంది. అంతేకానీ.. కంప్యూటర్లు, ట్విట్టర్ వల్ల కాదు. కొందరు ప్రజలు మమ్మల్ని అవమానించాలి అనుకుంటున్నారు. కానీ, వాళ్లు కంప్యూటర్లు, ట్వీట్ల వరకే చేరుకోగలరు. కాంగ్రెస్ నేతలు బస్సుల్లో జైలుకు వెళ్లి, డీజీపీ, పోలీస్ కమిషనర్ను కలిసి వాళ్ల పేర్లు రాయించుకుని గంటలో తిరిగొస్తున్నారు.
అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఇలాంటి స్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి నా రక్తం దారపోశాను. కానీ, నేను చేసిన మేలును మర్చిపోయింది. నేను కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీకి ఇంకా పేరు పెట్టలేదు. జమ్ము-కాశ్మీర్ ప్రజలే మా పార్టీ పేరును, జెండాను నిర్ణయిస్తారు. నేను పార్టీకి ఒక హిందుస్తానీ పేరు ఇస్తాను. అది కూడా అందరూ అర్థం చేసుకునేది’’ అని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఈ మెగా ర్యాలీలో 20,000 మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు.