Shashi Tharoor: మల్లికార్జున ఖర్గే గెలిస్తే ఆయనతో కలిసి పని చేస్తా: శశి థరూర్
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి ఎన్నిక జరగడానికి కొన్ని గంటల ముందు పోటీలో ఉన్న శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన బదులు మల్లికార్జున ఖర్గే గెలిస్తే, ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గెలిస్తే ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు శశి థరూర్. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఖర్గేతోపాటు శశి థరూర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక థరూర్ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి ఎన్నిక జరగడానికి ఒక్క రోజు ముందే చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సోమవారం ఈ ఎన్నిక జరగబోతుంది. ఈ సందర్భంగా శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. తాను గెలిస్తే పార్టీలో అనేక మార్పులు తీసుకొస్తానని చెప్పారు. తనకు, ఖర్గే సిద్ధాంతలకు మధ్య పెద్దగా తేడా లేదన్నారు. ‘‘మా ఇద్దరి భిన్న సిద్ధాంతాలతో ఎలాంటి సమస్యా లేదు. అయితే, నా పనితీరుతో పార్టీలో కొత్త మార్పును తీసుకొస్తా. మల్లికార్జున ఖర్గే అనుభవం కలిగిన నేత. ఆయన గెలిస్తే, ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధం. నా పూర్తి సహకారం అందిస్తా’’ అని థరూర్ వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం నుంచి కాంగ్రెస్ జాతీయాధ్యక్ష పదవి ఎన్నిక జరగబోతుంది.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులంతా ఈ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరగబోయే ఈ ఎన్నికలో మొత్తం 9,000 మంది ఓటు వేసే అవకాశం ఉంది. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇది ఆరో అధ్యక్ష ఎన్నిక మాత్రమే.