Eatala Rajender : ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎలా చేస్తారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేర్వేరు కాదు-ఈటలపై కాంగ్రెస్ నేతలు ఫైర్
Eatala Rajender: రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలను బయటపెడతాం. ఇకపై ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోము.
Eatala Rajender : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేతల మాటల దాడి కొనసాగుతోంది. మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు రూ.25కోట్లు ఇచ్చిందని ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. ఈటల ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఈటల తీరుని ఖండిస్తూ ఎదురుదాడికి దిగారు.
ఈటలవి ఆధారాలు లేని ఆరోపణలని కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేయడం మానుకోవాలని ఈటలకు హితవు పలికారు. నిన్న భాగ్యలక్ష్మి ఆయానికి రేవంత్ రెడ్డి వచ్చి ప్రమాణం చేస్తే ఈటల పారిపోయారని విమర్శించారు. ఇకపై ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఊరుకోరని అంజన్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు.
మల్లు రవి-పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు
బీజేపీ పార్టీ అంటే దేశంలో విడదీసి పాలించే పార్టీ. ఇలాంటి పార్టీలో చేరిన ఈటల రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం దారుణం. బీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్ను బయటకు పంపినపుడు పేదల పక్షాన పోరాటం చేశావని మేము సానుభూతి చూపాము. కానీ బీజేపీలో చేరిన మీరు మోసం చేసి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? మీరు అమ్మ అయ్యల మీద ఒట్లు పెడతారా? అంటూ తల్లిదండ్రులను అవహేళన చేసే విధంగా మాట్లాడారు.
భాగ్యలక్ష్మి దేవాలయాన్ని రాజకీయాల్లోకి తెచ్చిందే మీరే. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డిని అనలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అన్నాను అంటారు. కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి వేరు కాదు. మీరు అన్న మాటలకు ఆధారాలు ఉంటాయా అంటున్నారు. అంటే మీరు విలువ లేని మాటలు మాట్లాడారా..? మీ నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్లకు చెప్పండి నా దగ్గర ఆధారాలు లేవు. నేను ఆధారాలు లేకుండా మాట్లాడాను. మీరెవరూ స్పందించవద్దని చెప్పండి. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలను బయటపెడతాం.