యరపతినేని కేసు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలుగుదేశం నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. యరపతినేనిపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, హైకోర్టుకు తెలిపిన క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది.
రాజకీయ కారణాలతో ప్రభుత్వం వేధిస్తుందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేబినేట్ లో నిర్ణయం తీసుకుంది. ఈమేరకు హైకోర్టుకు కూడా తమ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో పల్నాడు ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ క్వారీయింగ్కు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై గత ఏడాది ఆగస్ట్ లో సీబీసీఐడీ విచారణ చేపట్టింది. అక్రమ మైనింగ్పై జరిపిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను హైకోర్టు ముందుంచింది.
నివేదికను విచారించిన కోర్టు.. కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలో లేదో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వంని కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది.