5 నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయి- నిధుల మళ్లింపుపై పవన్ కల్యాణ్ సీరియస్

కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా ఆపైన ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ.

5 నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయి- నిధుల మళ్లింపుపై పవన్ కల్యాణ్ సీరియస్

Updated On : June 26, 2024 / 7:52 PM IST

Swatchh Andhra Corporation : స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పై సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత పాలకులపై విరుచుకుపడ్డారు. వైసీపీ పాలకులు నిధులు మళ్లించి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

మంగళగిరిలోని తన నివాసంలో స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో స్వచ్చాంధ్ర కార్పొరేషన్ నిధులు ఏం చేశారు? ఎటు మళ్లించారు? అని అధికారులను ప్రశ్నించారు పవన్ కల్యాణ్. కార్పొరేషన్ లో రూ.7 కోట్లు మాత్రమే మిగిలాయని, 5 నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయని పవన్ అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్ల నిధి ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అని అధికారులను అడిగారు పవన్ కల్యాణ్. కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు? అని అధికారులను ప్రశ్నించారాయన.

”గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు జరిగింది. 2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించింది. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదైంది. దీనిపై వివరణ ఇవ్వాలి. నిధులు ఎటు వెళ్ళాయి? ఏం చేశారో? సవివరంగా నివేదిక ఇవ్వండి.

ఆ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.70 కోట్లు నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు అందించింది. రూ.46 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో రూ.239 కోట్లు నిధులు సమకూరాయి. ఖర్చు రూ.209 కోట్లు మేర చేశారు. స్వచ్ఛాంధ్ర నిధులనూ వదల్లేదు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమైతేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలము. దేశ ప్రధాని మోదీ సదుద్దేశంతో, ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొచ్చారు. అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర ఏర్పాటైంది.

కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా ఆపైన ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ. అందుకు 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం రూ.3 కోట్లు మిగల్చడమే ఉదాహరణ. దీన్నిబట్టే వైసీపీ పాలకులు నిధుల మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే… ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉంది. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలి. గత ఐదేళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దాం” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read : అందుకే, ఘోరంగా ఓడిపోయాం..!- దిమ్మతిరిగిపోయే కారణాలు చెబుతున్న వైసీపీ లీడర్లు