Tirumala : పార్వేట మండపం వద్ద ఏనుగుల సంచారం
తిరుమల సమీపంలో ఏనుగుల సంచారం మళ్లీ మొదలయ్యింది. తిరుమల సమీపంలోని పార్వేటి మండపం వద్ద 10 ఏనుగుల సంచరిస్తున్నట్లు టీటీడీ ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు.

Tirumala Elephants
Tirumala : తిరుమల సమీపంలో ఏనుగుల సంచారం మళ్లీ మొదలయ్యింది. తిరుమల సమీపంలోని పార్వేటి మండపం వద్ద 10 ఏనుగుల సంచరిస్తున్నట్లు టీటీడీ ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. శ్రీగంధం వనం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను ఏనుగులు ధ్వంసం చేసాయి. ఏనుగులు సంచరించిన ప్రాంతాన్ని టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాసులు రెడ్డి ,ఇతర ఫారెస్ట్ అధికారులు ఈరోజు పరిశీలించారు.
ఏనుగుల కారణంగా వాహన చోదకులకు, భక్తులకు అపాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఎఫ్ఓ తెలిపారు. ఏనుగులు తిరుమల అడవుల్లో సంచరించడం సర్వసాధారణమే అని… తిరుమల శేషాచలం అడవుల్లో ఏనుగుల సంచారం కొత్తేమీ కాదని ఆయన వివరించారు. లాక్ డౌన్ కారణంగా వాహనాల రణగొణ ధ్వనులు తగ్గడంతో ఏనుగులు రోడ్ల సమీపంలోకి రావడం జరిగిందని ఆయన చెప్పారు.
Also Read : Bandla Ganesh : చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన బండ్ల గణేష్
కొంత సమయం తర్వాత ఏనుగులు వాటంతట అవే తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోతాయని…వాటి కారణంగా ఎవరికీ ఎటువంటి హాని జరగదని శ్రీనివాసులు రెడ్డి ధైర్యం చెప్పారు. ఇటీవల మొదటి ఘాట్ రోడ్ లోని ఏడో మైలు ప్రాంతంలో ఏనుగుల సంచరించాయని.. తాజాగా పార్వేటి మండపం వద్ద ఏనుగులు సంచరించడం జరిగిందని డీఎఫ్ఓ శ్రీనివాసులు రెడ్డి అన్నారు.
అడవుల్లో నీటి లభ్యత తగ్గడంతో ఏనుగులు ఇటు వైపు వస్తున్నట్లు తెలుస్తోందని….పార్వేటి మండపం సమీపంలోని నెమళ్ల కుంటకు వచ్చి నీళ్లు తాగి వెళ్ళినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి అని డీఎఫ్ఓ చెప్పారు. వారానికి ఒకసారి తిరుమల పరిసరాలలో ఇటీవలి కాలంలో కనిపిస్తున్నాయని… అవి తిరిగే దారిలో ఫెన్సింగ్ కట్టటంతో ధ్వంసం చేశాయని ఆయన అన్నారు. ప్రస్తుతం 10నుంచి 15 వరకు ఉన్న ఏనుగుల గుంపు ఒక్కటే సంచరిస్తోందనిభక్తులు భయపడవద్దని వాటికి హాని జరుగుతుందనిపిస్తేనే దాడి చేస్తాయని ఆయన తెలిపారు.