Vemireddy Couple: సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వేమిరెడ్డి దంపతులు.. వాళ్లిద్దరిలో ప్రమోషన్ దక్కేదెవరికి?

నెల్లూరులో వైసీపీని తిరిగి కోలుకోకుండా చేసేందుకు..వేమిరెడ్డికి ప్రమోషన్‌ ఇస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తుందట టీడీపీ హైకమాండ్.

Vemireddy Couple: సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వేమిరెడ్డి దంపతులు.. వాళ్లిద్దరిలో ప్రమోషన్ దక్కేదెవరికి?

Vemireddy Prabhakar Reddy Representative Image (Image Credit To Original Source)

Updated On : January 14, 2026 / 10:49 PM IST
  • వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి సెంట్రల్‌ మినిస్టర్ పోస్ట్ అంటూ గాసిప్స్
  • ప్రశాంతిరెడ్డికి రాష్ట్రమంత్రివర్గంలో చోటు దక్కబోతోందా?
  • వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డిలో మంత్రి అయ్యేదెవరు.?

 

Vemireddy Couple: పాలిటిక్స్‌లో ఏదైనా పాజిబుల్. ఈక్వేషన్స్..క్యాస్ట్‌ క్యాలిక్యులేషన్స్..ఎవరికి ఎప్పుడు ఎలా పదవిని తెచ్చిపెడుతాయో చెప్పలేం. అవ‌కాశం కోసం ఎదురు చూసే లీడర్లకు ఎప్పుడు అదృష్టం ఏ రూపంలో త‌లుపు త‌డుతుందో కూడా అంచనా వేయడం కష్టమే. ఈ నేప‌థ్యంలోనే త్వర‌లోనే కేంద్ర, రాష్ట్ర మంత్రివ‌ర్గ ప్రక్షాళ‌న జరబోతోందన్న ప్రచారంతో..ఆ ఎంపీ, ఎమ్మెల్యే దంపతులకు అమాత్య యోగం పక్కా అంటూ రూమర్స్‌ బయలుదేరాయి. గత ఎన్నికలకు ముందే టీడీపీలో చేరిన ఆ దంపతుల్లో..ఎవరో ఒకరికి క్యాబినెట్‌ బెర్త్‌ పక్కా అంటూ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇంతకు ఎవరా దంపతులు? వాళ్లిద్దరిలో ప్రమోషన్‌ దక్కదెవరికి?

కొన్ని కొన్ని విషయాలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ముందే సోషల్‌ మీడియా దృష్టికే వస్తుంటాయ్. కొన్నిసార్లు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే నిజం అవుతుంది కూడా. ఇంకొన్ని సార్లు నెట్టింట్లో జరిగిన చర్చ అంతా ఉట్టిదే అయిన సందర్భాలున్నాయి. పాలిటిక్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో నిజమెంత ఉంటుందో.. గాలి వార్తలు కూడా అంతే ఉంటాయ్. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఒకటి తెగ వైరల్ అయిపోతుంది. అది కూడా ఏపీ పాలిటిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఇద్దరు దంపతుల గురించి. వారే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.

ఇద్దరిలో ఒకరికి ప్రమోషన్ పక్కా?

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బిజినెస్ మెన్. గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి..2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మొన్నటి ఎలక్షన్స్‌లో కోవూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎలక్ట్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమె టీటీడీ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్నారు. అయితే సొంత డబ్బులతో నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ, పేదలకు అండగా నిలుస్తూ..శభాష్‌ అంటూ ప్రజలతో ప్రశంసలు పొందుతున్నారు వేమిరెడ్డి దంపతులు. పైగా నాన్‌ కాంట్రవర్సీ లీడర్స్. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అయితే ఫుల్‌ యాక్టీవ్‌గా పనిచేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి దంపతుల్లో ఒకరికి ప్రమోషన్ పక్కా అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

కేంద్ర క్యాబినెట్‌ లో చోటు పక్కా?

రాబోయే రెండు మూడు నెలల్లో కేంద్ర మంత్రి వ‌ర్గ ప్రక్షాళ‌న జ‌ర‌గ‌బోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కేంద్ర క్యాబినెట్‌ లో చోటు పక్కా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సహాయ మంత్రిగా అయినా..ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుంటారన్న టాక్ బయలుదేరింది. వివాద రహితుడిగా పేరుండటం వేమిరెడ్డికి ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు. నెల్లూరులో వైసీపీని తిరిగి కోలుకోకుండా చేసేందుకు..వేమిరెడ్డికి ప్రమోషన్‌ ఇస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తుందట టీడీపీ హైకమాండ్.

మంత్రివర్గంలో ప్రశాంతిరెడ్డికి బెర్త్ ఖాయం..?

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీరోల్ ప్లే చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతుల్లో..ఎవరికో ఒకరికి అమాత్య యోగం పక్కా అంటూ సోషల్‌ మీడియా పోస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభాకర్‌రెడ్డిని సెంట్రల్ క్యాబినెట్‌లోకి తీసుకోకపోతే..రాష్ట్రంలో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెర్త్ ఖాయమంటూ చర్చించుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో వేమిరెడ్డి దంపతులకు అమాత్య యోగం అంటూ బలమైన ప్రచారం జరగడానికి..చంద్రబాబు, లోకేశ్‌ వాళ్ళిద్దరికి ఇస్తున్న ప్రధాన కారణం అంటున్నారు.

అయితే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలంటే..నెల్లూరు జిల్లాలో ఒక మంత్రిని తప్పించాల్సిన పరిస్థితి రావొచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి క్యాబినెట్‌లో ఉన్నారు. నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా..చంద్రబాబుకు సన్నిహితుడుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వేమిరెడ్డి సామాజికవర్గానికే చెందిన ఆనం రాంనారాయణరెడ్డి కూడా మినిస్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి.. ప్రశాంతిరెడ్డిని స్టేట్‌ క్యాబినెట్‌లోకి తీసుకుంటారా అన్నది సస్పెన్స్‌గానే కొనసాగనుంది.

అయితే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ జరగడానికి టైమ్‌ పట్టే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ మాత్రం..ఈ ఏడాది మేలోపు జరిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అదే గనుక జరిగితే..వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి సెంట్రల్ క్యాబినెట్‌లో బెర్త్‌ దక్కడం పక్కా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఏపీలో టీడీపీకి ఇప్పటికే రెండు ప‌ద‌వులు ద‌క్కాయి. మ‌రో బెర్త్‌ను కూడా టీడీపీకి ఇస్తారన్న ప్రచారం ఉంది. ఆ పోస్ట్ కోసం కొంత కాలంగా ప‌లువురు లాబీయింగ్ చేస్తున్నారట.

వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టే ప్లాన్?

నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాక‌ర్ రెడ్డికి చోటు దక్కడం పక్కా అంటూ నెట్టింట్లో జరుగుతోన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. 2029 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌నకు ప్రమోషన్ ఇవ్వబోతున్నారట. వైసీపీకి కోర్ ఓటు బ్యాంకుగా ఉన్న కీలకమైన రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని మ‌రింతగా త‌మ‌వైపు తిప్పుకోవడం లేదా..వైసీపీకి దూరంగా చేయడం అనే కాన్సెప్టుతో టీడీపీ ఈక్వేషన్స్‌ను మార్చేస్తోందట. అందుకే వేమిరెడ్డిని కేంద్రంలో మంత్రిని చేస్తే..క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయని భావిస్తున్నారట.

ఇప్పటికే కేంద్రమంత్రిగా ఉన్న గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖ‌ర్‌ కమ్మ సామాజిక వర్గం నాయకుడు. మరో కేంద్ర మంత్రి శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు బీసీ సామాజిక వ‌ర్గం యువనేత‌. ఈ క్రమంలో రెడ్లకు కూడా కేంద్రంలో ప్రాధాన్యం ఇస్తే..దాదాపు 11 సంవ‌త్సరాల త‌ర్వాత‌..ఏపీ నుంచి రెడ్డి నేతను కేంద్రమంత్రిని చేశామని చెప్పుకోవచ్చని..ఇది త‌మ‌కు మైలేజ్‌ను తెచ్చి పెడుతుందని టీడీపీ పెద్దలు అంచ‌నా వేస్తున్నారట. మరి సోషల్ మీడియా ప్రచారం నిజమై..వేమిరెడ్డి దంపతుల్లో ఎవరికో ఒకరికి అమాత్య యోగం దక్కేనా? లేక వేమిరెడ్డి దంపతులకు అమాత్య పదవి అనే ప్రచారం గాలి వార్తలాగే మిగిలిపోనుందా? అనేది చూడాలి.

Also Read: దాని తర్వాతే.. జిల్లాల టూర్ అంటున్న జగన్..! అసలు వైసీపీ చీఫ్ ప్లాన్ ఏంటి?