మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి దగ్గర…. కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. బస్సులో మంటలు చెలరేగిన సమయంలో 28మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా భయంతో బస్సుదిగి బయటకు పరుగులు తీశారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నవంబర్ 26, మంగళవారం రాత్రి బస్సు పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడికి చెందిన డబ్బు ఆగ్నికి ఆహుతైంది. 20 లక్షల నగదు మంటల్లో కాలిపోయింది. మల్లూరి రమణయ్య అనే ప్రయాణికుడు 20 లక్షల నగదున్న బ్యాక్ను తనవెంట తీసుకెళ్తున్నాడు. బస్సుకు మంటలు అంటుకున్నాయన్న ఆందోళనలో బ్యాగ్ను బ్ససులోనే వదిలేసి పరిగెత్తాడు. దీంతో 20 లక్షల రూపాయలు పూర్తిగా కాలిపోయాయని బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు.
మరో ప్రయాణికుడికి చెందిన లక్షా 50వేల విలువైన మొబైల్ మంటల్లో దగ్దమైంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. బస్సు పూర్తిగా దగ్ధం అయింది. బస్సులో షార్ట్సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.