Vijayawada Murder : విజయవాడలో పట్టపగలే దారుణ హత్య
విజయవాడలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై కొందరు దుండగులు ఒక వ్యక్తిని కత్తులతో హత్యచేసి పరారయ్యారు.
Vijayawada Murder : విజయవాడలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై కొందరు దుండగులు ఒక వ్యక్తిని కత్తులతో హత్యచేసి పరారయ్యారు. దుర్గా అగ్రహారంలో శుక్రవారం మధ్యహ్నం ఓ వ్యక్తిని కొందరు దుండగులు కత్తులతో దారుణంగా నరికి హత్య చేశారు. దుండగుల దాడిలో యువకుడు అక్కడికక్కడే కన్నుమూశాడు. హత్య అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. స్ధానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజి ఆధారంగా హంతకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుడిని కండ్రిగకు చెందిన రామారావుగా గుర్తించారు. ఈ ఘటనతో స్ధానికులు భయాందోళనలకు గురయ్యారు. హత్య ఆర్ధిక విబేధాల కారణంగా జరిగిందా, వివాహేతర సంబంధం కారణంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా .. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఒక మహిళ విషయంలో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కండ్రిగకు చెందిన రౌడీషీటర్ కుక్కల రవి, హేమంత్, కరీం ముగ్గురు పక్కా ప్లాన్ ప్రకారం హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే నిందితుల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఓ మహిళ విషయంలో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం జరుగుతున్నట్లు, ఆ నేపథ్యంలో హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మిగతా హంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.