Gurugram Academy : గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై కర్రలతో దాడి.. ఏడుగురికి తీవ్రగాయాలు!
Gurugram Academy : గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై దాదాపు 20 మంది విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు రెజ్లర్లకు తీవ్రగాయాలయ్యాయి.
![Gurugram Academy : గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై కర్రలతో దాడి.. ఏడుగురికి తీవ్రగాయాలు! Gurugram Academy : గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై కర్రలతో దాడి.. ఏడుగురికి తీవ్రగాయాలు!](https://10tv.in/wp-content/uploads/2024/04/Wrestlers-Dragged-Thrashed-With-Sticks-Inside-Gurugram-Academy.jpg)
Wrestlers Dragged, Thrashed With Sticks Inside Gurugram Academy
Gurugram Academy : గురుగ్రామ్లోని స్పోర్ట్స్ అకాడమీలో రెజ్లర్లపై దాడి జరిగింది. ఈ తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అకాడమీలోకి ప్రవేశించి అత్యంత దారుణంగా రెజ్లర్లను కొట్టారు. ఈ దాడిలో జాతీయ స్థాయి ఆటగాడు సహా ఏడుగురు రెజ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also : చూపుడు వేలిపై కూర్చున్న ఈ అత్యంత అరుదైన జంతువు ఎక్కడ కనపడిందో తెలుసా?
దాదాపు 20 మంది వ్యక్తులు, కర్రలు, ఆయుధాలతో రెజ్లింగ్ అరేనాలోకి ప్రవేశించి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లను తీవ్రంగా కొట్టారు. ఇదంతా అక్కడి సీసీఫుటేజీలో కనిపించింది. ఐదుగురు వ్యక్తులు కర్రలతో పదేపదే రెజ్లర్లను కొట్టగా, మరొకరు ఈడ్చుకెళ్లి కొట్టారు. రెజ్లర్లలో ఒకరిని నేలపైకి నెట్టి మరి కర్రలతో బాదడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
గురుగ్రామ్ జిల్లాలోని నౌరంగ్పూర్ గ్రామంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని నవశక్తి అకాడమీలో ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. గాయపడిన రెజ్లర్లలో కొందరికి చేతులు, కాళ్లు విరిగిపోయాయి. దాంతో బాధిత రెజ్లర్లను సివిల్ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
‘మా రెజ్లర్లలో ఒకరికి చేతులు, కాళ్లు విరిగిపోయినట్లు గుర్తించాం. వారిలో ఒకరు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఏ వివాదం కారణంగా రెజ్లర్లను కొట్టారో మాకు తెలియదు’ అని అకాడమీ అధికారి ఒకరు తెలిపారు. సుమారు 25 నుంచి 30 మంది అకాడమీలోకి ప్రవేశించారు. వారిలో కొందరిని గుర్తించామని చెప్పారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also : టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్కు గాయాలు