తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ షాక్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై అభ్యంతరం
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందన్న జగన్ ప్రభుత్వం… జాతీయ హోదా కల్పించే అంశాన్ని పరిశీలించొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
అంతేకాదు…పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఏపీలో కలపడంపై అభ్యంతరాలు చెప్పే హక్కు కూడా తెలంగాణ సర్కార్కు లేదని… అసలు పోలవరం కేసులో తెలంగాణను పార్టీగా పరిగణించాల్సిన అవసరమే లేదని పేర్కొంది. అఫిడవిట్లోని అంశాలు పరిశీలించాక… విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలుచేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి… సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు ఏపీ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు విభజన చట్టంలో లేవని.. కృష్ణా బోర్డు అనుమతులు కూడా లేవని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టులపై ముందుకెళ్తోందని అభ్యంతరం వ్యక్తంచేసింది. మరోసారి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం చర్యలు తీసుకోలేదని పేర్కొంది.
కృష్ణా బేసిన్లో 180 టీఎంసీలకు పైగా వినియోగించుకునేలా పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు ప్రాజెక్టులు… 450 టీఎంసీల నీటి వినియోగం నిమిత్తం కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకం తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులు చేపట్టిందని ఏపీ సర్కార్ తన అఫిడవిట్లో పేర్కొంది. రీ ఇంజినీరింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టినట్లు చెబుతున్నా… ఇది ముమ్మాటికీ నూతన ప్రాజెక్టేనని పేర్కొంది.
తెలంగాణ నూతన ప్రాజెక్టుల వల్ల పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలపై తీవ్ర ప్రభావం పడుతుందని.. అపెక్స్ కౌన్సిల్ ముందు ఈ అంశాలు పెట్టాలని పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామని కోర్టుకు దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల పరిధిలోని రైతులను విస్మరించి పక్షపాతంతో కాళేశ్వరం పనులు కొనసాగిస్తున్నారని… అందుకే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని తెలిపింది.